
బీజేపీలో చేరిన హౌసింగ్ రిటైర్డ్ డీఈఈ
జనగామ రూరల్: స్టేషన్ ఘన్పూర్ రిటైర్డ్ డీఈఈ సీతా దుర్గాప్రసాద్ బీజేపీలో చేరారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల విజయానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీతా శ్యామల, డాక్టర్ గుండె రాహుల్, అరుణ్ కుమార్, భూపాల రమేష్, పూర్ణచందర్, శోభ రాణి, రాంరెడ్డి, శివకుమార్, శేఖర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
‘ఎంపీటీసీ స్థానాల్లో అన్యాయం’
రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో జనాభా ప్రకారం కాకుండా అధికారులు అన్యాయం చేశారని ఆ గ్రామానికి చెందిన రాపోలు రామ్మూర్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో రామ్మూర్తి మాట్లాడుతూ ఎంపీటీసీల స్థానాల కేటాయింపులో 2019లో అన్యాయం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక్కో ఎంపీటీసీ స్థానానికి 1,000 నుంచి 2,400 ఓటర్లు కలిగి ఉండాలన్నారు. కంచనపల్లిలో 5,200 ఓటర్లకు కేవలం ఒకే ఎంపీటీసీ స్థానం కేటాయించి అన్యాయం చేశారన్నారు. కంచనపల్లి గ్రామానికి రెండు ఎంపీటీసీ స్థానాలు కేటాయించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును అశ్రయించినట్లు తెలిపారు. ఈ విషయమై ఈ నెల 7న హైకోర్టులో విచారణ జరుగనున్నట్లు ఆయన వివరించారు.
9 నుంచి లా సప్లిమెంటరీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లాకోర్సు ఏడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్, 22న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు.