
వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
హన్మకొండ/కాజీపేట రూరల్: వరంగల్ మహానగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని దిల్కుశ్ అతిథి గృహంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని జిల్లాకు చెందిన విశ్రాంత పోస్టల్ ఉద్యోగులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూనిర్వాసితులు కలిశారు. వరంగల్కు కేంద్ర ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ మంజూరు చేసినందుకు విశ్రాంత పోస్టల్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని రైతులు వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని, వెల్నెస్ సెంటర్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని విశ్రాంత ఉద్యోగులకు హామీ ఇచ్చారు. త్వరలో కాజీపేట రైల్వే పరంగా శుభవార్త తెలుపుతామని మంత్రి అన్నారని రైల్వే జేఏసీ కన్వీనర్ రాఘవేందర్ తెలిపారు.
జనగామ రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలన కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేశామని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
లింగాలఘణపురం: ఏపీలో ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ పత్రికపై, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతుకను ఎవరూ ఆపలేరని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా అన్నారు. ఆదివారం మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసులు, కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, అంతటితో ఆగకుండా సాక్షి మీడియాపై కూడా దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం అవుతారని అన్నారు.
టెట్పై ఆందోళన
అవసరం లేదు
విద్యారణ్యపురి: టెట్పై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైతే స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) నుంచి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమనాధుని రవి అన్నారు. ఆదివారం హనుమకొండలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్న అందరూ టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్సీటీఈ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాల్ని అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కామగోని రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేమునూరి రాంబాబు, జిల్లా ఆర్థిక కార్యదర్శిగా దానం శివకోటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.