
అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి
● ఇటు చదువు.. అటు పాటలు
● జానపదగేయాలతో రాణిస్తున్న కట్కూరి స్నేహ
● 40కి పైగా పాటలు రాసిపాడిన యువతి
‘దూసుకోను దువ్వెన తెమ్మంటది..
చూసుకోను అద్దం తెమ్మంటది..
కాటుక తెమ్మంటది.. కాళ్లకు పెట్టుమంటది..
అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి..’
‘బావో నా బంతి పూల దండ.. నిన్న చూస్తుంటే నా గుండెల గుదిబండ..’ అంటూ స్నేహ పాడితే యువత గుండెలు జారిపోతున్నాయి. ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ జానపద పాటలను రాసి, పాడింది రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన కట్కూరి స్నేహ. చదువుకుంటూనే పాటలు రాస్తున్న యువజానపద గాయనీ గురించి తెలుసుకుందాం..
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన కట్కూరి స్నేహ కరీంనగర్లో ఎంఫార్మసీ చదువుతోంది. ఇప్పటి వరకు 40కి పైగా జానపద గేయాలు రాసి, పాడింది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పాటల్లో చాలా మటుకు స్నేహ రాసి, పాడినవే. హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో బాలల దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించిన పాటల పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచింది. ఈ పోటీలు ఆమెను పాటలు పాడడం వైపు మళ్లించాయి. బీ ఫార్మసీ చదువుతుండగా తనకు పాటలు రాయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా పాటలు, రాసి పాడింది. శేఖర్ మాస్టర్ కావాలంటే ఇటీవల రాసి, పాడిన ‘అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి..’ పాట మంచి పేరు తెచ్చిందని పేర్కొంది. చదువుకుంటూనే పాటలు రాస్తానని స్నేహ చెప్పింది. సినిమా పాటలు పాడాలనేది తన జీవిత ఆశయమని పేర్కొంది.