
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. డెంగీ, సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రతిరోజు డ్రైడే పాటించేలా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరదలతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. వాటర్ లీకేజీలను మున్సిపల్ సిబ్బంది గుర్తించాలని పేర్కొన్నారు. డీపీవో మాట్లాడుతూ మొత్తం 296 ఫాగింగ్ మిషన్స్, 336 హ్యాండ్పంప్స్ ఉన్నాయని, 31 వేల ఆయిల్బాల్స్ తయారు చేశామన్నారు. టిమోపస్, మలాథియన్ గ్రామ పంచాయతీలకు చేర్చామన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఎంహెచ్ ప్రమోద్కుమార్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, కమిషనర్లు పాల్గొన్నారు.
ఉత్తరాది నుంచి కూలీలు వచ్చే పరిస్థితి లేదు
జగిత్యాలఅగ్రికల్చర్: ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కూలీలు జిల్లాకు వచ్చే పరిస్థితి లేదని కలెక్టర్ అన్నారు. ఆయిల్ పాం సాగుపై జిల్లాకేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ధాన్యం తూకం వేసేందుకు, మిల్లుల్లో, మామిడి మార్కెట్లో పనిచేసేందుకు గతంలో ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పాం సాగు వైపు అడుగులు వేయాలని సూచించారు. మంచి ఆదాయంతోపాటు సబ్సిడీలు అందే అవకాశం ఉందన్నారు. లోహియా కంపెనీ సీఈఓ సిద్దాంత్ లోహియా మాట్లాడుతూ.. బుగ్గారం మండలం యశ్వంత్రావుపేటలో సెప్టెంబర్ 4న ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 4,700 ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతోందని, ఈ ఏడాది మరో 3500 ఎకరాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంకుమార్ పాల్గొన్నారు. ఆయిల్ పాం సాగు చేసే రైతులను కలెక్టర్ సన్మానించారు.