
ఇంకా అందని కొత్త పింఛన్లు
● ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు ● ప్రభుత్వం నుంచి కొలిక్కిరాని స్పష్టత
జగిత్యాలరూరల్: ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ల కోసం అర్హులు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అర్హులై న ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్, బీడీ కార్మికులు, వికలాంగులు, గీతకార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికుల ఫించన్లు పెంచుతామని ప్రకటించింది. అధికారంలోకొచ్చాక అర్హులందరూ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా తమకు పింఛన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. పింఛన్దారులకు గత ప్రభుత్వం నెలకు రూ.2016 చొప్పున అందించిన విషయం తెల్సిందే. అధికారంలోకొస్తే దివ్యాంగులకు రూ.4016కు పెంచుతామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో అర్హులందరూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పింఛన్ల కోసం కూడా వేడుకుంటున్నారు.
ఏళ్ల తరబడి మంజూరు కాని పెన్షన్
2016లో అప్పటి ప్రభుత్వం మంజూరు ఇచ్చిన పెన్షన్లనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు ఇస్తున్నారు. ఇద్దరూ లేని ఇంట్లో పెన్షన్ను తొలగిస్తున్నారు. పెన్షన్లపై డీఆర్డీఏ పీడీ రఘువరణ్ను వివరణ కోరగా పింఛన్ల పెంపు ఇంకా ఖరారుకాలేదన్నారు.
జిల్లాలో పెన్షన్ల వివరాలు
వృద్ధాప్య 60,138
వితంతు 43,925
వికలాంగ 16,561
గీత కార్మిక 3,435
చేనేత 2,404
హెచ్ఐవీ 666
ఫైలేరియా 1,667
డయాలసిస్ 83
ఒంటరి మహిళ 4,553
బీడీ వర్కర్స్ 88,660
టేకేదార్లు 756
మొత్తం 2,22,848