
‘డబుల్’ ఇళ్లను ఆక్రమించుకున్న పేదలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పలువురు పేదలు మంగళవారం రాత్రి ఆక్రమించుకోవడంతో పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఇక్కడ మొత్తం 592 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. కానీ, కేటాయింపు జరగలేదు. దీంతో వెంటనే అర్హులైన నిలువనీడ లేని నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో గదుల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడినట్లు పలువురు మహిళలు తెలిపారు. ఖాళీగా ఉన్న గదుల్లో వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి స్పందించి అర్హులకు డబుల్ బెడ్ రూంలు కేటాయించాలని కోరారు.