
రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి
2040 అవసరాలకు
అనుగుణంగా మాస్టర్ ప్లాన్
● మామూనూరు విమానాశ్రయ
భూసేకరణకు రూ.205 కోట్లు
● రాష్ట్ర అవతరణ వేడుకల్లో
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సాక్షి, వరంగల్ : కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా నగర అభివృద్ధికి రూ. 4,962 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖిలావరంగల్ మైదానంలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 2040 సంవత్సరం వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ను తీసుకువచ్చామన్నారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్ పోర్టు త్వరలో సాకా రం కాబోతోందని, విమానాశ్రయ భూసేకరణకు ప్రభుత్వం రూ.205కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేశామని, నర్సంపేటలోని మెడికల్ కాలేజీ, ఆస్పత్రి సేవలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసి సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి నట్లు పేర్కొన్నారు. వరంగల్ పాత బస్స్టేషన్ స్థానంలో అధునాతన సౌకర్యాలతో కొత్త బస్స్టాండ్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రూ.80 కోట్ల వ్యయంతో వరంగల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం(కలెక్టరేట్) పనులు శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులను చిత్తశుద్ధితో త్వరలోనే పూర్తి చేస్తామని, కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇప్పటికే ఇక్కడికి కొన్ని కంపెనీలు వచ్చాయని, ఇటీవల సీఎం విదేశీ పర్యటనలోనూ కొన్ని కంపెనీలు రావడానికి అంగీకరించాయని వివరించారు. వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని చిత్రాలు 8,9లో

రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి

రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి

రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి