
డివిజన్ సరే.. సిబ్బంది నియామకమేది..?
హన్మకొండ: డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సిబ్బంది నియామకంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రారంభం.. సేవలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ వినియోగదారుల విజ్ఞప్తులు.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏటూరునాగారం కేంద్రంగా ఎన్పీడీసీఎల్ సేవలు అందించేందుకు యాజమాన్యం ప్రత్యేక డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గత నెల 31న సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డివిజన్ పరిధిలోని ప్రస్తుత సెక్షన్లను విభజించి ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటు చేశారు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈ పోస్టుగా మళ్లించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన ఇతర ఇంజనీర్లు, సిబ్బంది నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడక పోవడంతో డివిజన్ ఎప్పుడు ఏర్పాటవుతుంది..? ఎప్పటి నుంచి సేవలు అందుబాటులోకి వస్తా యి..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ములుగు డివిజన్ పరిధిలో ములుగు టౌన్, మల్లంపల్లి, వెంకటాపూర్, పస్రా, తాడ్వాయి సెక్షన్లు, ఏటూరునాగారం సబ్ డివిజన్లోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం సెక్షన్లు, ఎన్.వి.పురం సబ్ డివిజన్లోని కె.వెంకటాపురం, వాజేడు సెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి ఏటూరునాగారం, కె.వెంకటాపురం సబ్ డివిజన్లలోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం. ఎన్.వెంకటాపురం, వాజేడు సెక్షన్లను కలిపి ఏటూరునాగారం డివిజన్గా ఏర్పాటు చేశారు.
డీఈ పోస్టు ఒకటే మంజూరు..
డివిజన్ పాలనా వ్యవహారాలు సాగించేందుకు డివిజనల్ ఇంజనీర్, ఏఈ కమర్షియల్, ఏఈ టెక్నికల్, ఇద్దరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. కాగా ఇందులో ఒక డీఈ పోస్టును మాత్రమే మంజూరు చేశారు. ఇతర పోస్టుల గురించి ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈగా మళ్లించినప్పటికీ నియామకం చేపట్టలేదు. ఇతర పోస్టుల మంజూరు, అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత లేకపోవడంతో డివిజన్ పరిపాలన కార్యక్రమాల ప్రారంభంపై స్పష్టత లేకుండా పోయింది.
పని భారం పెరుగుతుందని ఆందోళన..
అదనపు పోస్టులు మంజూరు చేయకుండా.. అదనపు సిబ్బందిని నియమించకుండా ప్రస్తుత డివిజన్లోని ఉద్యోగులను విభజిస్తే వారిపై పని భారం పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టులు, సిబ్బందిని నియమించకుండా నూతన డివిజన్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించిన తర్వాతే నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలు, సర్కిళ్ల పునర్విభజన జరిగి పదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ వాచ్మెన్. స్వీపర్ పోస్టుల బైఫరికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. బైఫరికేషన్ చేయాలని ఆదేశాలున్నా చర్యలు లేదు. ఇప్పటికై నా యాజమాన్యం వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల బాధ్యులు కోరుతున్నారు.
ఏటూరునాగారం కేంద్రంగా విద్యుత్ డివిజన్ ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత కరువు
ములుగు డివిజన్లోని
సెక్షన్ల బదలాయింపుతో సరి..