
స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభం
రాష్ట్ర అవతరణ వేడుకల్లో మేయర్ సుధారాణి
న్యూశాయంపేట : ప్రజలు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆమె మహానగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వరంగల్ నగరం అగ్రగామిగా నిలవడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారు ల నిబద్ధత, సమన్వయమే కారణమని పేర్కొన్నా రు. సీఎం రేవంత్రెడ్డి వరంగల్ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నగరం రానున్న రోజుల్లో టూరిజం హబ్గా ఏర్పడనుందని చెప్పారు. నగర ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,170 కోట్లు మంజూరు చేసిందని, భారీ వర్షాలు కురిసినా ప్రజ లకు ఇబ్బందులు ఉండకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మేయర్ తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ.944 కోట్ల 67లక్షలతో 108 అభివృద్ధి పనులు మంజూరు కాగా 70 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సోమవారం నుంచి సెప్టెంబర్ 9 వరకు బల్దియా ఆధ్వర్యాన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు.