
వ్యర్థాల తరలింపులో నిర్లక్ష్యంపై మేయర్ ఆగ్రహం
వరంగల్ అర్బన్ : నాలాలు, డ్రెయినేజీల్లో తొలగించిన వ్యర్థాలను తరలించకుండా వదిలేయడంపై నగర మేయర్ గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పోతనగర్ రోడ్డులోని స్మార్ట్సిటీ పనులతో చేపడుతున్న అభివృద్ధి పనులను, 28, 29 డివిజన్లలో సుశీల్ గార్డెన్ జంక్షన్నుంచి రామన్నపేట, బీట్ బజార్నుంచి 12 మోరీలు, రఘునాథ కాలనీ డ్రెయిన్ల మీదుగా బట్టల బజార్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి, వేంకటేశ్వర స్వామి ఆలయం వెనుక వైపున గల డ్రెయిన్లు, ఇతర ప్రాంతాలను ఇంజనీరింగ్, శానిటేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పోతననగర్ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టి మట్టికుప్పలను అలాగే వదిలి వేయడం వల్ల భారీ వర్షాలు కురిసే క్రమంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఆ కుప్పలను వెంటనే తొలగించేలా చూడాలన్నారు. దుకాణదారులు డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా నియంత్రించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రేతలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగించి ఉల్లంఘిస్తే పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. ప్రధాన నాలాల్లో మూడు రోజుల్లోగా పూడికతీత పూర్తి చేయాలని సూచించారు. తనిఖీల్లో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ రవి కుమార్, టీపీఎస్లు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్, టౌన్ అధికారుల
సమన్వయంతో పనిచేయాలి
క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన
మేయర్ గుండు సుధారాణి