
యూరియా గోల్మాల్ చేస్తున్న తమ్ముళ్లు
నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతల
అనుయాయులకు అందజేత
పొన్నెకల్లు సొసైటీ పరిధిలో రోడ్డుపైనే
లారీ నుంచి ట్రాక్టర్లకు యథేచ్ఛగా లోడింగ్
అడ్డగోలు నిబంధనలతో సామాన్యుడికి మాత్రం తప్పని కష్టాలు
తాడికొండ: కో ఆపరేటివ్ సొసైటీల్లో యూరియా గోల్మాల్ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. దీనిపై సంబంధిత వ్యవసాయ శాఖాధికారుల నిఘా కొరవడటంతో సామాన్యుడికి యూరియా అందని ద్రాక్షగా మారింది. కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా సామాన్యులకు యూరియా సరఫరా చేయాల్సి ఉండగా ఎక్కడా అలా జరగడం లేదు. నేరుగా అధికార పార్టీ నాయకులకు, వారి అనుయాయులకు చేరుతోంది. సామాన్యుడికి మాత్రం ఆధార్పై నామమాత్రంగా రెండు బస్తాల యూరియా ఇస్తున్నారు. అదీ ఒక నానో యూరియా బాటిల్ను అంటగట్టేలా అధికారులు నిబంధనలు విధించారు. కానీ అధికార పార్టీ నేతలకు మాత్రం సొసైటీకి బస్తాలు చేరకుండానే అందించి, బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. సోమవారం తాడికొండ మండలం పొన్నెకల్లు సొసైటీకి చెందిన ఎరువుల లారీ నిబంధనలకు విరుద్దంగా అడ్డరోడ్డు కూడలిలో ట్రాక్టర్కు లోడింగ్ చేస్తుండగా సాక్షి కెమేరాకు చిక్కారు. ఈ క్రమంలో కూలీలు ముఖం దాచుకొని కిందకి దిగి డోర్లు వేయగా... లారీ, ట్రాక్టర్లతో డ్రైవర్లు తలో దిక్కుకు వెళ్లిపోయారు. సొసైటీకి చెందిన యూరియా బస్తాలు ఎవరికి ఇస్తున్నారు? రోడ్డుపై ఎందుకు ఇలా దించుతున్నారు? అని ప్రశ్నించగా ఎవరికి వారే నీళ్లు నములుతూ ముఖం చాటేశారు. రైతులకు సక్రమంగా సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ కనీస నిబంధనలకు కూడా నీళ్లొదిలింది. అన్ని సొసైటీల్లోనూ సరుకు తప్పుదారి పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు యూరియాను సక్రమంగా సరఫరా చేయాలని కోరుతున్నారు.