
పీఆర్సీని ప్రకటించాలి
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని ప్రకటించాలని, ఐఆర్ ఇవ్వాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఆప్కాస్ ఉద్యోగులకు కూడా ఐఆర్ అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీ ఎంఈఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 8న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఆదివారం ఏలూరులోని కార్మిక సంఘాల కా ర్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రవి మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవులు, డీఏ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఉ ద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, గౌరవ సలహాదారులు ఎస్.శంకర రావు, రాష్ట్ర నాయకులు సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం లైసెన్స్ ఉన్న ఆటో, క్యాబ్, బస్, లారీ, టిప్పర్ డ్రైవర్లందరికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అలాగే ఎన్నికల హామీలన్నింటినీ అ మలు చేయాలన్నారు. అలాగే కామవరపు కోట మండలం ఆడమిల్లిలో విద్యుత్ షాక్తో గాయపడ్డ ప్రైవేట్ ఎలక్రీషియన్ బి.వంశీకి పూర్తి వైద్యం, ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో సోమవారం జిల్లాస్థాయిలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
భీమవరం: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లుగా 25 ఏళ్లుగా పనిచేస్తున్న 1998 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11న విజయవాడలో విజ్ఞాపన సభ నిర్వహించనున్నట్టు ఎంటీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్ తెలిపారు. విజ్ఞాపన సభ సన్నాహక సమావేశం ఆదివారం స్థానిక లూథరన్ హైస్కూల్లో నిర్వహించారు. టెంపరరీ ఎంటీఎస్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, 62 ఏళ్ల వరకు సర్వీస్ పెంచాలని, 12 నెలల జీతం, మినిమమ్ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన విజ్ఞాపన సభను విజయవంతం చేయాలని కోరారు. కో–ఆర్డినేటర్లు ఎం.రాజలింగం, ఎన్.అనిల్ అరవింద్కుమార్, ఎంవీ కృష్ణారావు, హేమంత్కుమార్, వీఎల్ఎన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
తణుకు అర్బన్: ఆర్టీసీలో కొత్త బస్సుల కోసం నిధులు కేటాయించకుండా సీ్త్ర శక్తి పథకాన్ని ప్రారంభించారని, కొత్త బస్సులకు నిధులు కే టాయించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య అన్నారు. ఫెడరేషన్ పశ్చిమగోదావరి జిల్లా రెండోమహాసభలు ఆదివా రం తణుకు అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నెల రోజుల్లోనే కండక్టర్లు, డ్రైవర్లపై వేధింపులు, కేసులు, 60 మందికిపైగా సస్పెన్షన్లు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పథకం ఉద్యోగులను వేధించే పథకంగా మా రకూడదని, కొత్త బస్సులు వేసి ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలు వెంటనే ఆపాలని, తొలి దశలో ప్రధాన నగరాల్లోని 2 డిపోలను, రెండో దశలో 19 డిపోలను ప్రైవేట్ విద్యుత్ బస్సు ఆపరేటర్లకు అప్పజెప్పేలా సన్నాహాలు జరుగుతున్నాయని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు టీవీఎస్ మూర్తి జెండా ఆవిష్కరణ చేసి మహాసభకు అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఏఎస్ రాయుడు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, డిపో కార్యదర్శులు పాల్గొన్నారు.