
ప్రాణం తీసిన ఈత సరదా
● ఇద్దరి పరిస్థితి విషమం
శ్రీరంగరాజపురం : ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని 50 బసివిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పోన్నైకు చెందిన లావణ్య (12) వేసవి సెలవుల్లో భాగంగా తమ బంధువులు 50 బసివిరెడ్డిపల్లి కాలనీలోని హరి, లత ఇంటికి వచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం హరి భార్య లత తమ పిల్లలు కార్తీక్ (12), పల్లవి (09)తోపాటు తమ అన్న కూతురు లావణ్య (12)తో పాటు కలిసి గ్రామం సమీపంలో ఉన్న ముక్కల చెరువులో ఈత, చేపల వేట కోసం వెళ్లారు. ఈ క్రమంలో లత చేపలు పడుతుండగా ముగ్గురు పిల్లలు సరదాగా చెరువులో ఈత నేర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు లావణ్య, పల్లవి, కార్తీక్ కాలుజారి చెరువులో మునిగిపోయారు. గమనించిన లత చెరువులో మునిగిపోతున్న ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే లావణ్య మృతి చెందింది. కార్తీక్, పల్లవిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
అంజన్న అభయం
తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామికి అర్చ కులు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఉత్పవమూర్తి ఆంజనేయస్వామికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, శాస్త్రోక్తంగా పూజలు చేసి దూప దీప నైవేద్యం సమర్పించారు. ఉత్సవమూర్తిని పల్లకిలో కొలువుదీర్చి ప్రాకారోత్సవం చేశారు. భక్తులు స్వామికి వసంతాలు కలిపి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆల య ఈఓ హనుమంతురావు, సిబ్బంది పాల్గొన్నారు.
గరుడవాహనంపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం రాత్రి గరుడ వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు విశేషాలంకృతుడైన వేణుగోపాలుడు గరుడ వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించారు. డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్ మునిశేఖర్, ఆలయ అధికారి తదితరులు పాల్గొన్నారు.