
జిల్లాలో 32 శాతం రేషన్ పంపిణీ పూర్తి
అనకాపల్లి : చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమంలో నేటి వరకూ 32 శాతం పంపిణీ పూర్తి చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. స్థానిక 84వ వార్డు కోట్ని వీధి 15 వ నెంబర్ రేషన్ షాపు పరిధిలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించి, భీమునిగుమ్మం వీధిలో వృద్ధురాలు ఇంటికి రేషన్ను ఆమె స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, వృద్ధులకు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయాలని ఆమె కోరారు. డిజిటల్ పేమెంట్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో 1069 రేషన్షాపులు ఉన్నాయని, వాటి ద్వారా ఐదు లక్షల ముప్ఫై వేల కార్డుదార్లకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో దివ్యాంగులు, కదలలేని స్థితిలోను, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు సుమారు 66 వేలు మంది ఉన్నారని, వారందరికీ రేషన్ డీలర్లు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేస్తారని తెలిపారు. రెండు రోజుల లోపల శత శాతం పంపిణీ పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోపల మధ్యాహ్నం 12 నుండి 4 గంటల సమయంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు, వృద్ధులు జాబితా అందరి రేషన్ డీలర్ల వద్ద ఉందని వారికి ఇంటి దగ్గరే సరుకులు పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, జిల్లా సరఫరా అధికారి కె.ఎల్.ఎన్ మూర్తి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.