
మీ సేవలు చాలు.. వెళ్లిపోండి.!
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఫారిన్ సర్వీసుపై పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులందరినీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వర్సిటీకి చేరాయి. దీంతో రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ కాలేజీల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన వారంతా నేడో రేపో ఇక్కడ నుంచి రిలీవ్ కానున్నారు. ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్ కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో జరిగినందున ఉన్నత విద్యామండలి అధికారులు ఇందుకు అనుమతించారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో 40 మంది వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఏయూలో పనిచేస్తున్నారు.
వీసీ కీలక నిర్ణయం
ఆంధ్ర యూనివర్సిటీకి ఆర్థిక భారమవుతున్న వారిని పంపించేయాల్సిందే అని వర్సిటీలోని కొంతమంది కొంతకాలంగా పట్టుబడుతున్నారు. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ ఇటీవల క్యాంపస్ కాలేజీల డీన్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఎయిడెడ్ అధ్యాపకుల విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారిని పంపించేయాల్సిందేనని మెజార్టీ విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని వర్సిటీ నుంచి రిలీవ్ చేస్తామని ఈ నెల 19న కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు నివేదించారు. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ అధ్యాపకులంతా తదుపరి పోస్టింగ్ కోసమని కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆచార్యుల కొరత తీరేదెలా.?
ఏయూలో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. వెయ్యి మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం రెండు వందల్లోపే రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. దీంతో ఎయిడెడ్, కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులే బోధనలో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 38 ఎయిడెడ్ అధ్యాపకులు రిలీవ్ చేస్తే.. ఆ స్థానాలను వేరే మార్గాల్లో భర్తీ చేయాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు వీసీ దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు
ఏయూలో ప్రొఫెసర్ల కొరత వేళ..
ఎయిడెడ్ అధ్యాపకులకు ఉద్వాసన
వీసీకి కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ
విద్యార్థుల చదువులపై ప్రభావం
31 నాటికి రిలీవ్ చేస్తాం
ఏయూలో పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులను వెంటనే పంపించాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎయిడెడ్ అధ్యాపకులను ఏయూలో కొనసాగించుకుంటారా? లేదా అని ఇటీవల డైరెక్టర్ నుంచి లేఖ వచ్చింది. దీనిపై తమ పరిధిలో నిర్ణయం తీసుకుని వారిని పంపించేస్తామని నివేదించాం. ఈ నెల 31న నాటికి ఎయిడెడ్ అధ్యాపకులందరినీ ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తాం.
– ఆచార్య ధనుంజయరావు, రిజిస్ట్రార్