
నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్
స్పీకర్ మైనింగ్ అక్రమాలపై ఫిర్యాదు
తుమ్మపాల: స్పీకర్ అయ్యన్నపాత్రుడి మైనింగ్ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నర్సీపట్టణం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కలెక్టర్ విజయ కృష్ణన్కు ఫిర్యాదు చేశారు. కొత్త సిరిపురం నుంచి మైనింగ్ ప్రదేశానికి రహదారిని అనధికారికంగా నిర్మించి వినియోగిస్తున్నారని గణేష్ ఆరోపించారు. గతంలో పర్యావరణ అనుమతులు లేని కారణంగా ట్రిబ్యునల్ పనులను నిలిపివేసిందని, ఇప్పుడు అదే స్థలంలో మైనింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు. న్యాయవ్యవస్థ ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించి మైనింగ్ చేపడుతున్నారన్నారు. అనుమతులు లేని అన్ని మైనింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు.
తుమ్మపాల: తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ప్రజలు, ప్రజా సంఘాలు చేపట్టిన నిరసనలు, ధర్నాలతో కలెక్టరేట్ హోరెత్తింది. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు నిరసన వ్యక్తం చేశారు. నేరుగా కలెక్టరేట్కు వచ్చి పదేపదే అర్జీలు సమర్పిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటు వాపోయారు. దళిత సంఘాలు, ఎండీయూ వాహనదారులు, గిడ్డంగుల హమాలీలు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి నియంత్రించారు. కలెక్టరేట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరి వద్ద ఉన్న సంచులు, వస్తువులను తనిఖీ చేసి లోపలికి పంపించారు. ఒకరిద్దరి వద్ద అనుమానాస్పద వస్తువులు ఉండడంతో వారిని మందలించి, అర్జీతో మాత్రమే పీజీఆర్ఎస్ వేదిక వద్దకు పంపించారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్ అర్జీలు స్వీకరించారు. పలువురు మహిళలు ఇంటి స్థలాల మంజూరు కోసం అర్జీ అందజేసేందుకు ఉదయాన్నే వచ్చినా కలెక్టర్ దగ్గరకు వెళ్లకుండా సిబ్బంది అడ్డుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
డొంకాడ దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. దళితులపై దాడి జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా నేటికీ నిందితులను అరెస్టు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. దాడికి గురైన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుకు తగ్గట్టుగా ఎఫ్ఐఆర్లో సెక్షన్లు నమోదు చేయకుండా దోషులను కాపాడేలా పోలీసులు బెయిలబుల్ సెక్షన్లు వేశారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. తక్షణమే నిష్పక్షపాత విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు రవి సిద్ధార్థ, రాజు బాబు, బి.వెంకటరమణ, ఎం.అప్పలరాజు, చిరంజీవి, లోవరాజు, దొరబాబు, రాము, అప్పారావు, కన్నారావు, శివ, ఆనందరావు, స్వర్ణ రాజు, మురళి, రాజు పాల్గొన్నారు.
వివాహితులకూ
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
నక్కపల్లి: మండలంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో నిర్వాసిత కుటుంబాల్లో వివాహితులకు, మేజర్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని పలువురు నిర్వాసితులు సోమవారం జిల్లా కలెక్టర్ను కోరారు. చందనాడ, తమ్మయ్యపేట, మూలపర, అమలాపురం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, వైఎస్సార్సీపీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు సూరాకాసుల గోవిందుల ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి, అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసేకరణ సమయంలో టీడీపీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని, నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మగ, ఆడవారికి వివాహాలైనా ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారన్నారు. తాజాగా అధికారులు నిర్వహించిన గ్రామసభల్లో ప్రకటిస్తున్న లబ్ధిదారుల జాబితాల్లో వివాహాలైన మహిళల పేర్లు లేవన్నారు. డీఫారం భూముల్లో ఫల సాయానికి కూడా నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. బుచ్చిరాజుపేటలో కొత్తూరు, చందనాడలో కర్రివారి వీధి, తమ్మయ్యపేటలో తుమ్మలపేట, పాటిమీద, మూలపర, బోయపాడు, డీఎల్పురంలో వాడపేటను వేరొక చోటకు తరలిస్తున్నారన్నారు. దీంతో ఇళ్లు, నివాస ప్రాంతాలను కోల్పొతున్న వారికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం ఇంటి స్థలం, రూ.8.30 లక్షలు ఆర్థిక సాయం మాత్రమే అందిస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. ఇది ఏమూలకు సరిపోదన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన సీ్త్ర, పురుషులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింజేయాలన్నారు. ఇంటి స్థలంతో పాటు రూ.25 లక్షల ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ కింద సాయం అందజేయాలని కోరారు.

నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్

నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్