
‘ఉల్లాస్’తో వయోజన విద్యకు ఊతం
తుమ్మపాల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఉల్లాస్ కార్యక్రమంపై బుధవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉల్లాస్ పథకంపై ప్రచారం చేసి, జిల్లాకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. 2025–26 సంవత్సరానికి 24,977 మందికి వయోజన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అక్ష్యరాస్యత శాతం తక్కువగా గల మండలాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామ సచివాలయం, గ్రామీణాభివద్ధి, మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీలు, పాఠశాలల్లో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ, కార్మికుల్లో నిరక్షరాస్యులైన వారిని గుర్తించి ఆ సమాచారాన్ని వయోజన విద్య అధికారులకు అందజేయాలాని, వారిని ఈ పథకం ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించే టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య సహాయ సంచాలకుడు డి.చిన్నికృష్ణ, కమిటీ సభ్యులు డీఆర్డీఏ పీడీ శచీదేవి, జిల్లా, గ్రామ, వార్డు సచివాలయ అధికారి ఎస్.మంజులవాణి, మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ అనంతలక్ష్మి పాల్గొన్నారు.