
రేషన్ కార్డుల కోసం ప్రయాస
కొయ్యూరు: రేషన్ కార్డుల్లో నమోదు కోసం సుదూర ప్రాంతాల వచ్చిన గిరిజనులు బూదరాళ్ల పంచాయతీలో అవస్థలు పడుతున్నారు. నల్లబిల్లి, కన్నవరం, కునుకూరు, బాలారేవులు, చీడిపల్లి, పోకలపాలెం నుంచి బూదరాళ్ల రావాలంటే కనీసం 40 కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. వారి గ్రామాల నుంచి ముందుగా కొయ్యూరు వచ్చి అక్కడి నుంచి బూదరాళ్ల వెళ్లాలి. దీని కోసం జీపుల్లో ప్రయాణం చేస్తున్నారు. అంత దూరం నుంచి వస్తే సచివాలయంలో పనులు చేయాల్సిన డిజిటల్ సహాయకుడు ఉండడం లేదు.
ఆయన కనీసం సెలవు కూడా పెట్టకుండా వెళ్లిపోయారని చెబుతున్నారు. దీంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ మాట్లాడుతూ డిజిటల్ అసిస్టెంట్ కనీసం సెలవు పెడుతున్నట్టు సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్తామన్నారు.

రేషన్ కార్డుల కోసం ప్రయాస