కైలాస్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా మద్యం, డబ్బు ప్రవాహా నికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టింది. నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా జిల్లాలో 14 ఫ్లయింగ్ స్క్వాడ్, మూడు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను నియమించింది. రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖల డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో వాహన తనిఖీలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల వద్ద రౌండ్ది క్లాక్ నిఘా ఏర్పాటు చేశారు. రూ.50వేలకు మించి నగదును ఆధారాలు లేకుండా తరలించినట్ల యితే సీజ్ చేయనున్నారు.
చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా..
ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు అక్రమాలకు ఆస్కారమిచ్చే అనుమానాస్పద ప్రాంతాల్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీం (ఎస్ఎస్టీ)లను ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు భోరజ్తో పాటు ఉట్నూర్ ఎక్స్రోడ్, నేరడిగొండ టోల్ ప్లాజా వద్ద నిఘా ఉంచేందుకు వీలుగా మూడు టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఇద్దరు నాయబ్ తహసీల్దార్లు, ఒక పోలీస్ అధికారిని నియమించారు. ఏఎస్డబ్ల్యూవోకు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు వీడియోగ్రాఫర్ నిత్యం వెంట ఉండనున్నారు. రౌండ్ ది క్లాక్ తనిఖీలు చేపట్టనున్న ఈ బృందాల్లో ఓ అధికారి ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు మరో అధికారి సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ మద్యం, డబ్బు తరలించకుండా చర్యలు తీసుకోనున్నారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు..
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా ఆదేశాల మేరకు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ ప్రత్యేక బృందాలు ఆదివారం నుంచి రంగంలోకి దిగాయి. ఎఫ్ఎస్టీలు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పర్యవేక్షణతో పాటు అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచనున్నారు. మద్యం, డబ్బు తరలిస్తూ పట్టుబడితే సీజ్ చేస్తారు. చెక్పోస్టుల వద్ద ఉండే ఎస్ఎస్టీలు వాహన తనిఖీలు ముమ్మరం చేశాయి.
రూ.50వేలకు మించి తరలిస్తే సీజ్..
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు రూ.50వేలకు మించి నగదు తరలించొద్దు. ఒకవేళ తరలిస్తే దానికి సంబంధించిన రశీదులు చూపించాలి. లేకుంటే ఆ నగదును సీజ్ చేస్తారు. ఇక అక్రమంగా మద్యం తరలిస్తే మాత్రం సరుకు సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తారు. అలాగే రూ.10వేలకు మించి గిప్ట్లను తరలించినట్లయితే వాటిని కూడా సీజ్ చేయనున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలివిడత ఎన్నికల నామి నేషన్ల గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో బరి లో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు గాను మద్యం, నగదు, బహుమతులు వంటి ప్రలోభాలకు గురిచేసే ఆస్కారముంటుంది. అయితే వీటికి చెక్ పెట్టేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం దిగుమతికి అవకాశం ఉండటంతో దాన్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. అలాగే క్షేత్రస్థాయిలో పకడ్బందీ నిఘా ఉంచేలా 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది.
ఇచ్చోడ – సిరికొండ, బోథ్ – సొనాల, జైనథ్ – భోరజ్, బేల –సాత్నాల, తాంసి – భీంపూర్, నార్నూర్ – గాది గూడ వంటి రెండేసి మండలాలకు ఒక టీంను ఏర్పాటు చేయగా మిగతా మండలాలకు ఒక్కో టీం చొప్పున మొత్తం ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమ అధికారులు, మిషన్ భగీరథ ఏఈలు, నాయబ్ తహసీల్దార్లు, ఐకేపీ ఏపీఎంలు, మండల వ్యవసాయాధికారులు టీం లీడర్గా వ్యవహరిస్తారు. ప్రతీ బృందంలో ఒక పోలీస్ అధి కారి, ఓ వీడియోగ్రాఫర్ కలిపి ముగ్గు రు ఉండనున్నారు. అలాగే ముగ్గురు అధికారులను రిజర్వ్లో ఉంచారు. ఈ బృందాలు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నాయి.

వాహన తనిఖీలు ముమ్మరం