
రత్లే, క్రిష్ణగంగలకు అనుమతి
జమ్మూ కశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న క్రిష్ణగంగ, రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది.
వాషింగ్టన్: జమ్మూ కశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న క్రిష్ణగంగ, రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే 1960నాటి సింధు జలాల ఒప్పందాన్ని అనుసరించి కొన్ని పరిమితులకు లోబడి ఆనకట్టల నిర్మాణాలు ఉండాలంది. పాకిస్తాన్, భారత్ నుంచి కార్యదర్శి స్థాయి అధికారులు తన వద్ద చర్చలు జరిపిన అనంతరం ఓ ప్రకటనను ప్రపంచ బ్యాంకు మంగళవారం విడుదల చేసింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ నుంచి పాక్కు ప్రవహిస్తున్న పశ్చిమ నదులపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారత్... ఈ వ్యవహారంతో సంబంధంలేని ఇతర వ్యక్తి/సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు.
సింధునది ఉపనదులైన జీలం, చీనాబ్లపై భారత్ 330 మెగావాట్ల సామర్థ్యంగల క్రిష్ణగంగ, 850 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాలను ఇప్పటికే ప్రారంభించగా, వీటిపై పాకిస్తాన్ అభ్యంతరాలు తెలుపుతూ వస్తోంది. ఈ ప్రాజెక్టుల ఆకృతులు సాంకేతికంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లం ఘిస్తున్నాయని పాక్ వాదిస్తోంది. వివాదాన్ని పరిష్కరించాలంటూ పాక్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. తాజాగా పాక్, భారత్ కార్యదర్శి స్థాయి అధికారులు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తి త్వంలో ఈ వారంలో భేటీ అయ్యారు. తదుపరి దఫా చర్చలు సెప్టెంబరులో జరగనున్నాయి.