
బీరు సీసాతో వ్యక్తిపై దాడి
తణుకు అర్బన్: పాత కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని బీరు సీసాతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు కృష్ణ, ముద్దాపురం గ్రామానికి చెందిన గండికోట జాన్ యేసు మధ్య పాత కక్షలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి దువ్వ దానమ్మ తల్లి ఆర్చి సమీపంలో ఉన్న కృష్ణపై యేసు బీరు సీసాతో దాడి చేసి విచక్షణారహితంగా గాయపరిచాడు. తీవ్రగాయాలపాలైన కృష్ణను స్థానికులు సమాచారంతో 108 వాహనం ద్వారా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే కత్తితో దాడిచేసిన ఘటనలో యేసు జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్పై విడుదలై వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీటి కుంటలో పడి
గొర్రెల కాపరి మృతి
చాట్రాయి: నీటి కుంటలో పడి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన చాట్రాయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సర్నాల మారేశ్వరావు (40) మంగళవారం తన గొర్రెలను మేతకు తోలుకెళ్లాడు. సమీపంలో ఉన్న మందపాటి బసవారెడ్డి తోటలోని నీటి కుంటలో మేక పిల్ల పడిపోవడంతో మారేశ్వరరావు దానిని రక్షించబోయి మునిగి మృతిచెందాడు. అతడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

బీరు సీసాతో వ్యక్తిపై దాడి