
పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరం
బుట్టాయగూడెం: పొగాకు సాగులో విప్లవాత్మక మార్పులు అవసరమని ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. జీలుగుమిల్లి ఐకార్ జాతీయ, వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో ఉత్తమ నాణ్యత, అధిక దిగుబడికి ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో పొగాకు బేరన్ల నిర్వహణ గురించి రైతులకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశోధనా కేంద్రం ప్రతినిధి కొడవటి వాసుదేవరావు మాట్లాడుతూ ఐకార్– ఎన్ఐర్సీఎ, ఐఓసీఎల్, ఎమినెన్ట్ గ్యాస్ టెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్యాస్ అథారిటీ పొగాకు బేరన్ పనిచేయు విధానాన్ని రైతులకు వివరించారు. గడచిన 30 ఏళ్లుగా పొగాకు రైతులు పొగాకు బేరన్లో కలప వాడటం వల్ల అధికంగా వచ్చే కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ వర్నేకర్, సంస్థ చీఫ్ మేనేజర్ లలిత, పొగాకు బోర్డు ఎక్స్టెన్షన్ మేనేజర్ సురేఖ, బోర్డు ఆర్ఎమ్ ప్రసాద్, ప్రాజెక్టు హెడ్ డాక్టర్ ఎల్కే ప్రసాద్, ఎన్ఐఆర్సీఏ ఆర్ఎస్ హెడ్ డాక్టర్ వైవీ సుబ్బయ్య, టి.వెంకటేష్, టి.రమేష్, దేవానంద్, పొగాకు బోర్డు అధికారులు, ట్రేడ్ ప్రతినిధులు, ఎన్ఐఆర్సీఏ శాస్త్రవేత్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఐకార్ ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్