
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఎన్సీసీ, స్పోర్ట్స్, సైనికోద్యోగుల పిల్లలు, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 28 నుంచి నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నాలుగు రోజుల సర్టిఫికెట్ల పరిశీలనలో ఎన్సీసీ విభాగంలో మొత్తం 1,454 మందికి గాను 1,101 మంది, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 1,032 మందికి గాను 742 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 270 మందికి గాను 198 మంది, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించి 247 మందికి గాను 185 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులకు, వారితో పాటు వచ్చిన వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, ఏఆర్ అర్జునరావు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.