
గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
భీమవరం: భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన వృద్ధురాలు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన ఘటన ఇది. గుండె నొప్పితో ఎస్.జయలక్ష్మి (70) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ నెల 25న చేరినట్లు ఉన్న కాగితంతో ప్రాంతీయ ఆసుపత్రికి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వచ్చింది. చికిత్స అందించేలోపు శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. చిరునామా, ఇతర వివరాలు చెప్పకుండానే ఆమె మృతి చెందింది. వృద్ధురాలి వివరాలు తెలిసిన వారు ఆసుపత్రి అధికారులకుగాని, పోలీసులకు గాని వివరాలు తెలియజేయాలని వన్టౌన్ పోలీసులు తెలిపారు.
దాడి చేసిన వ్యక్తి అరెస్టు
భీమవరం: డబ్బులు ఇస్తేనే సోడా ఇస్తానన్న దుకాణ యజమానిపై దాడి చేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లూ యాదవ్ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. చినరంగనిపాలెం ప్రాంతంలో సోడా కొట్టు నిర్వహిస్తున్న ఎస్.వీరవెంకట సత్యనారాయణ దగ్గరకు బేతనీపేటలో ఉంటున్న బబ్లూయాదవ్ ఈ నెల 26న వెళ్లి సోడా అడిగాడు. డబ్బులు ఇస్తేనే సోడా ఇస్తానని చెప్పగానే అతనిపై నిందితుడు దాడికి దిగాడు. అంతేకాక అతని వద్ద ఉన్న రూ. 2 వేలు లాక్కెళ్లిపోయాడు. సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎస్సై ఎస్వీవీఎస్ కృష్ణాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.