
కోకో గింజల విక్రయానికి దరఖాస్తు చేసుకోండి
తాడేపల్లిగూడెం రూరల్: ప్రతి రైతు నుంచి ఎకరానికి 300 కిలోల కోకో గింజలను కొనుగోలు చేస్తామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్.దేవానంద్ కుమార్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనంలో వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కోకో గింజలు కిలోకు రూ.500 ధర నిర్ణయించిందన్నారు. ఈ ధరకు కంపెనీలు రైతుల నుంచి కొనుగోలు చేస్తాయన్నారు. ఇందులో కిలోకు రూ.50 రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ వారికి చెల్లించడం ద్వారా ఈ పథకం అమలు చేస్తుందన్నారు. కోకో రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 30వ తేదీలోగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం
పెంటపాడు: పెంటపాడులోని వెలంపేట కోనేరు చెరువు వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని బుధవారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడమ చేయి మోచేతి వరకూ విరిగి కింద పడి ఉంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బర్ల జయ రాంబాబు ఈ విషయాన్ని ముందుగా గుర్తించారు. మంగళవారం రాత్రి వరకూ విగ్రహం బాగానే ఉందని, ఉదయం చూస్తే ఇలా చేయి విరిగి పడి ఉందని వైఎస్సార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న సమయంలో ఇక్కడ వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడం చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి జిల్లాలో ఓదార్పు యాత్ర చేసిన సమయంలో ఈ విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించారు. విగ్రహం జీవ కళ ఉట్టిపడేలా ఉందని శిల్పిని, నిర్వాహకులను అభినందించారు. అప్పటి నుంచి ఇక్కడ పలు కార్యక్రమాలను వైఎస్సార్ అభిమానులు నిర్వహిస్తున్నారు.

కోకో గింజల విక్రయానికి దరఖాస్తు చేసుకోండి