
అమాయక భక్తులు బలి కావాల్సిందేనా..?
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు అర్బన్: చంద్రబాబు పాలనలో అమాయక భక్తులు బలికావాల్సిందేనని మరోసారి రుజువు చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భగవత్ స్వరూపాన్ని తనివితీరా చూడాలనే ఉద్దేశంతో ఆలయాలకు వస్తున్న భక్తుల ప్రాణాలను కూటమి ప్రభుత్వం హరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవాన్ని తిలకించేందుకు వెళ్లిన భక్తులు భద్రతా లోపం వల్ల అసువులు బాసారని దుయ్యబట్టారు. సనాతన ధర్మం అంటూ హంగామా చేసేవారు ఇప్పుడు ఏం చెబుతారని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే హడావుడి చేయాల్సిన అవసరం లేదని, మీకు సనాతన ధర్మం అనే అర్హత లేదని విమర్శించారు. అప్పన్న స్వామి దర్శనానికి రూ.300 టికెట్ తీసుకుని వచ్చిన భక్తుల ప్రాణాలను నిర్లక్ష్యంగా వ్యవహరించి బలిగొన్నారన్నారు. గత పాలనలో చంద్రబాబు ప్రచార పిచ్చితో పుష్కరాల్లో 29 మందిని బలితీసుకోగా ఇటీవల తిరుపతిలో తొక్కిసలాటలో అమాయక భక్తులు మరణించారని గుర్తు చేశారు. ఆలయ ఈవోతో పాటు కాంట్రాక్టర్, ఇతర బాధ్యులందరిపై హత్యాయత్నం కేసులు నమోదుచేయాలని, మృతుల కుటుంబ సభ్యులకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.25 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పశువధ కర్మాగారం మీ పాపమే కదా
టీటీడీలో గోవుల ప్రాణాలు కూడా తీసేస్తున్నారని, ఇదంతా కూటమి ప్రభుత్వ చేతకానితనమేనని మాజీమంత్రి కారుమూరి విమర్శించారు. తణుకులో రక్తపాతం సృష్టిస్తున్న పశువధ శాల స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన, ఆర్ఎస్ఎస్ నాయకుల ప్రోత్సాహంతోనే నడుస్తుందని విమర్శించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పేదలకందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. పొగాకు, కోకో, మిర్చి, టమోటా, ఆయిల్పాంకు గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడుతున్నారని.. కరెంటు బిల్లులు చూస్తుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు.