
భక్తుల మృతి కూటమి ప్రభుత్వ వైఫల్యమే
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే సింహాచలంలో భక్తులు ప్రాణాలు కోల్పోయారని మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే హిందూ ఆలయాల్లో వరుసగా ఘోరాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో లడ్డూ కల్తీ అయ్యిందంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రచారం చేసి.. చివరకు సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తిన్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. తిరుపతిలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా కళ్ల ముందే కదులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన వాదినని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ ఆనాడు కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. శ్రీ కూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోతే వాటికి పోస్టుమార్టం చేయకుండా ఈవో ఆఫీసు వెనుకే దహనం చేయడం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. తిరుమలలో వందలాది గోవులు మరణిస్తే.. నిర్లక్ష్య ధోరణితో మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు.
టెండర్లను రద్దు చేసి.. దోపిడీకి పాల్పడ్డారు
రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం అవినీతిని వీడటం లేదని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ నిధులతో పలు ఆలయాలను అభివృద్ధి చేశామని చెప్పారు. రూ.50 కోట్లతో సింహాచలం ఆలయాన్ని అభివృద్ధి చేశామని.. ఇప్పటికీ కొనసాగించాల్సిన అభివృద్ధి పనుల టెండర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. వారికి కావల్సిన వ్యక్తులకు వాటిని కట్టబెట్టిందని దుయ్యబట్టారు. అభివృద్ధి పనుల అంచనాలను పెంచి దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు పచ్చ మీడియా రక్షణ కవచంలా పనిచేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవన్కల్యాణ్.. ఇప్పుడు ఆలయాల్లో ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు.
దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు ఆగ్రహం