
పచ్చిరొట్ట సాగుతో భూసారం మెండు
చింతలపూడి: రసాయన ఎరువుల వాడకం నానాటికీ పెరుగుతుండడంతో భూసారం తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో పోషకాల లోపం ఏర్పడి పంటలు చీడపీడల బారిన పడి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పంట భూములను సారవంతంగా మార్చుకుని అధిక దిగుబడులు సాధించాలంటే పచ్చిరొట్ట సాగు ఒక్కటే మార్గం. రైతులు తమ పొలాల్లో పంటలు సాగులో లేనప్పుడు పచ్చిరొట్ట సాగు చేసుకోవాలి. తొలకరికి ముందు వివిధ రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు రాయితీపై అందిస్తున్నారు. ప్రతి ఏటా వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు వాటి నివేదికలను వ్యవసాయశాఖ అందచేస్తుంది. భూసారాన్ని పెంచడానికి రైతులు కనీసం రెండు పంటలు వేసిన తరువాత పచ్చిరొట్ట పైర్లు సాగుచేయాలని వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి నాగకుమార్ తెలిపారు.
● పచ్చిరొట్ట సాగు వల్ల భూసారం పెరగడమే కాక చీడ, పీడల బెడద తగ్గుతుంది. దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. భూసారం పెంచే పచ్చిరొట్ట పైరులైన జనుము, జీలుగ, పిల్లి పెసర సాగు చేసి ప్రయోజనం పొందవచ్చు.
● సేంద్రియ పదార్థాలను నేలకు అందించడం, కలుపు మొక్కలను నివారించడం, నేలలో జీవ రాశులకు ఆహారంగా, మొక్కలకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలను అందించే సాధనాలుగా పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయి.
● ప్రస్తుతం పొలాలకు కృత్రిమంగా ఉపయోగిస్తున్న నత్రజని వాడకాన్ని 20 నుంచి 30 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. పచ్చిరొట్ట పైర్లు సాగు చేసిన భూముల్లో పంటలు ఆరోగ్యంగా పెరిగి, చీడ, పీడలను తట్టుకోవడమే కాకుండా నేలలో నీరు, రసాయన ఎరువులు భూమి కింది పొరలకు జారిపోకుండా పచ్చిరొట్ట అడ్డుకుంటుంది.
● నేలలో చౌడును తగ్గించి శీతాకాలంలో కూడా నేలలోని ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండటానికి పచ్చిరొట్ట సాగు ఉపకరిస్తుంది. చౌడు భూముల్లో జీలుగ, నీరు నిల్వ ఉండే భూముల్లో జనుము వేసుకోవడం ఉత్తమం.
● జీలుగ హెక్టారుకు 20 టన్నులు, జనుము 21 టన్నులు, పిల్లి పెసర 18 టన్నుల దిగుబడి వస్తుంది. ఇటు పశుగ్రాసం కొరతను తీర్చడమే కాక భూమిని సారవంతం చేస్తాయి. ఎరువు కోసమైతే పచ్చిరొట్ట పైర్లను పూత సమయంలో నేలలో కలియదున్నుకోవాలి.
● పైరు వయసు 50 రోజుల నుంచి 60 రోజులు మించకుండా కలియదున్ని ఒకటి రెండు వారాల తరువాత నాట్లు వేసుకోవాలి. జీలుగ, పిల్లి పెసర విత్తనాలు ఎకరానికి 16 కిలోలు, జనుము 20 కిలోల చొప్పున వేసుకోవాలి.
రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు అందిస్తుంది. సబ్డివిజన్లో ఈ ఏడాది 3,152 క్వింటాళ్లు పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. చింతలపూడి మండలంలో 1,475 క్వింటాళ్లు, కామవరపుకోట మండలంలో 525 క్వింటాళ్లు, లింగపాలెం మండలంలో 332 క్వింటాళ్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 820 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.
బి నాగకుమార్
వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్
పాడి – పంట
రసాయన ఎరువుల వినియోగంతో అనర్థాలు
మెట్ట భూముల్లో లోపిస్తున్న పోషకాలు
భూసారం, అధిక దిగుబడుల కోసం పచ్చిరొట్ట సాగు మేలంటున్న నిపుణులు

పచ్చిరొట్ట సాగుతో భూసారం మెండు

పచ్చిరొట్ట సాగుతో భూసారం మెండు