
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో దోపిడీ?
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్ఎం) కోర్సుకు కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. పూర్తి ఉచితంగా భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. జీఎన్ఎం కాలేజీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పేద పిల్లల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాయి. జీజీహెచ్ భవనంలోని నర్సింగ్ కాలేజీలో అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ జీఎన్ఎం కోర్సుకు అడ్మిషన్లు జరిగాయి. ప్రభుత్వం ఏటా 60 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల బాలికలకు జీఎన్ఎం కోర్సు చదివేందుకు అడ్మిషన్లు ఇస్తోంది. అడ్మిషన్ల సమయంలో సదరు నర్సింగ్ కాలేజీ యాజమాన్యం కొత్తగా కోర్సులో చేరుతున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి వివిధ రకాల ఫీజుల పేరుతో సుమారుగా రూ.16 వేల వరకూ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్మిషన్ చార్జీ పేరుతో రూ.2 వేలు, పుస్తకాల పేరుతో కొంత వసూలు చేస్తున్నారు. యూనిఫాంలు బయట కుట్టించుకోవటానికి వీల్లేదని.. నర్సింగ్ కాలేజీ చెప్పిన చోట డబ్బులు కట్టి యూనిఫాం తీసుకోవాలని నిబంధన పెడుతున్నారు. ముందుగా భోజనం పెట్టటం సాధ్యం కాదని.. స్టైఫండ్ వచ్చే సరికి 3 నెలలు పడుతుందని ఈ లోగా ఆ సొమ్ములు మీరే చెల్లించాలని చెబుతున్నారు.
ప్రశ్నిస్తే.. వేధింపులే ? అసలే పేదవర్గాల పిల్లలు.. ఏదైనా సమస్య వస్తే ఇదేంటని ప్రశ్నిస్తే... వారికి ఇక వేధింపులే. పాస్ కావాలంటే మా చేతుల్లోనే ఉంటుందని, నోరెత్తితే సర్టిఫికెట్ రాదంటూ బెదిరిస్తున్నారు. విద్యార్థినిలు తమ బాధను మౌనంగానే భరిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. బాత్రూంలు సరిపడా ఉండవు. వాటిని క్లీన్ చేయటానికి సిబ్బందిని డబ్బులు ఇచ్చి మరీ ఏర్పాటు చేస్తారు. అయితే విద్యార్థినులే బాత్రూం క్లీన్ చేసుకోవాలంటున్నారు.
శిక్షణకు రవాణా చార్జీలు చెల్లించాల్సిందే
కోర్సులో భాగంగా సర్వేలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రూరల్ ప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు రవాణా చార్జీలు వారే చెల్లించాల్సి రావటం భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల పాటు సర్వే, ఇతర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, రోజుకు సుమారుగా రూ.70 నుంచి రూ.100 ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు .నెలకు సుమారుగా రూ.2 వేలకు పైగా వెచ్చించాల్సి రావటం వారి కుటుంబాలపై ఆర్థికంగా భారం పడుతుందని వాపోతున్నారు.
ఒక్కో విద్యార్థిని నుంచి రూ.16 వేల వరకూ వసూలు
పేద విద్యార్థినులపై ఆర్థిక భారం