
రఘురామకృష్ణరాజు నోరు అదుపులో పెట్టుకోవాలి
ిసీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు బలరాం
భీమవరం: ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిపై చేసిన వ్యాఖ్యలు అవమానకరం, అసభ్యకరంగా ఉన్నా యని, ఆయన నోటిని అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని ిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం అన్నారు. శుక్రవారం భీమవరం సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశంలో పార్టీ కార్యదర్శి జెఎన్వీ గోపాలన్, కార్యదర్శి వర్గ సభ్యుడు బి.వాసుదేవరావుతో కలిసి మాట్లాడారు. నిత్యం అసభ్య పదజాలాన్ని ఉపయోగించే వ్యక్తి కాబట్టే డిప్యూటీ స్పీకర్ పదవికి అనర్హుడని మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారన్నారు. ఆయన దూషణలు, తాటాకు చప్పుళ్లకు కమ్యూనిస్టులు బెదిరిపోరని స్పష్టం చేశారు. నాలుక ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. మా పార్టీ నాయకుడు మీలా పార్టీలు మారి పదవి కోసం గడపల దగ్గర దేకలేదని, ఆర్థిక నేరగాడు కాదని, ప్రజా ధననాన్ని లూటీ చేసిన మనిషి కాదని విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే ఏం చేయకుండా అధికారాన్ని, ప్రజా ధనాన్ని అలవెన్సులుగా తీసు కుని ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారన్నారని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు భూస్వాములకు అమ్ముడైపోయాడని, అందుకే వారి చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఆయనకు కనబడడం లేదన్నారు. కాలుష్యమంటూ గొంతు చించుకుంటున్న ఆయనకు యనమదుర్రు డ్రెయిన్, వెంకయ్య వయ్యేరు, బొండాడ డ్రెయిన్, గొంతేరు నదిలో ఉన్న కాలుష్యం కనబడదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో శిధిలావస్థల్లో ఉన్న గరగపర్రు, జక్కరం వంతెనలు కనబడవా? అని ఎద్దేవా చేశారు. ఉండి నియోజకవర్గంలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు బడాబాబుల చేతుల్లో ఉన్నాయని దమ్ముంటే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సవాల్ విసిరారు. జిల్లాలోని పోలీసులు, ఇతర శాఖల అధికారులు తప్పు చేస్తున్నారని ఎవరో చెబితే నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే ఆ తర్వాత పర్యవసానం వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గంలో 800 పేదల ఇళ్లు, 200 షాపులు కూల్చి వేయించి సుమారు రూ.40 కోట్ల ఆస్తిని ధ్వంసం చేయించారని గోపాలన్ చెప్పారు.