
మొదటి అదనపు సివిల్ జడ్జిగా లలితాదేవి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం మొదటి అదనపు సివిల్ జడ్జిగా కె.లలితాదేవి నియమితులయ్యారు. విశాఖ ఏడో జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్ కోర్టు) నుంచి బదిలీపై వస్తున్నారు. పట్టణంలో మొదటి అదనపు సివిల్ జడ్జిగా ఉన్న డి.అరుంధతి గుడివాడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయ్యారు.
వేతన బకాయిలు చెల్లించాలి
భీమవరం: ఉపాధి హామీ కూలీల వేతన బకా యిలు తక్షణం విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉపాధి హామీ కూలీల సమస్యలపై ధర్నా సందర్భంగా ఆయన మాట్లా డారు. నాలుగు నెలలుగా ఉపాధి కూలీల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుమారు రూ.25.42 కోట్ల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా మస్టర్ వేయడం వల్ల కూలీలు ఫొటో దిగడం కోసం అనేక కిలోమీటర్ల నడ వాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బాతిరెడ్డి జార్జి, షేక్ పాదుషా, గుబ్బల నాగేశ్వరరావు, సోడదాసి సంజీవరావు, కానేటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు అరికట్టాలని, దీనిపై రెవెన్యూ, పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో మట్టి మాఫియా యథేచ్ఛగా మట్టిని తవ్వి రూ.కోట్లు సంపాదిస్తోందని, అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యం చేస్తోందని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సంఘటనే అందుకు సాక్ష్యమని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దాసరి బాబురావు భార్య నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో తన పొలం నుంచి అక్రమంగా మట్టి తీసుకెళ్తున్న వారిని బాబూరావు అడ్డుకుంటే దౌర్జన్యంగా అతను కారులో ఉండగానే పొక్లెయిన్తో కారును పైకెత్తి గుంటలో పడేశారని.. దీని బట్టి పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. దాసరి బాబురావు, అతని భార్య జిల్లా అధికారులు, పోలీసులు, లోకేష్ను కలిసి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదని.. దీంతో మట్టి మాఫియా ఎంత బలంగా ఉందో తెలుస్తోందని స్పష్టం చేశారు. బాబురావు టీడీపీ కార్యాలయంలో ఆత్మహత్య యత్నం చేశారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాబూరావు భార్య తెలిపారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
గోనె సంచుల కొరతపై ఫిర్యాదు
ఉండి: ధాన్యం అమ్మకంలో గోనె సంచుల కొరత ఉందని, రైతులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం ఉండి మండలం యండగండి రైతు సేవా కేంద్రాన్ని జేసీ పరిశీలించారు. ధాన్యం అమ్మకానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని.. అయితే గోనె సంచుల కొరత ఉందని రైతులు చెప్పారు. దీనిపై స్పందించిన జేసీ రైసుమిల్లర్లతో నేరుగా మాట్లాడి రైతులకు 20 వేల గోనె సంచులు వెంటనే అందుబాటులో ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రైతులతో కలసి తేమశాతం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు అధికారులు సహకరించకపోతే తెలియచేయాలని సూచించారు. మిల్లుకు ధాన్యం తోలిన 48 గంటల వ్యవధిలోనే రైతు ఖాతాలో నగదు జమచేస్తామన్నారు. గోనె సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు.

మొదటి అదనపు సివిల్ జడ్జిగా లలితాదేవి