
మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. ముందుగా స్వామి వారిని ఆలయ అర్చకలు ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారికి ప్రభాత సేవ మొదలుకుని, నిత్యకై ంకర్యాలతో విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని ఏలూరు జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సూర్యచంద్రరావు దర్శించుకున్నారు. వారి వెంట లక్కవరం ఎస్సై శశాంక ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,66,246 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు.
మావుళ్లమ్మకు 200 గ్రాముల బంగారం సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక మావుళ్లమ్మ వారికి బంగారు వస్తువుల తయారీకి మంగళవారం భీమవరం పట్టణానికి చెందిన ఇన్నమూరి యోగ శివాన్ష్, వేదన్ష్, పి.హర్షిల్ 200 గ్రాముల బంగారు బిస్కెట్లు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. అయితే ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి గణేష్ మాట్లాడుతూ 200 గ్రాముల బంగారం సంబంధించి అమ్మవారి సన్నిధిలో వస్తువుల తయారీకి అందించారని, ఈ బంగారం సంబంధించి దేవస్థానం నుంచి ఎలాంటి రసీదుగాని, రికార్డుల్లో నమోదు చేయలేదని తెలిపారు. కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణ మూర్తి, ఐ.కృష్ణారావు దంపతులు, స్వర్ణ వస్త్ర నిధి సేకరణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మద్యం సేవించి డ్రైవింగ్.. రూ.10 వేల జరిమానా
భీమవరం: స్థానిక వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ముద్దాయికి రూ. 10 వేలు జరిమానా విధించినట్లు వన్టౌన్ సీఐ ఎం నాగరాజు మంగళవారం చెప్పారు. పట్టణానికి చెందిన నెలపర్తి ప్రెక్షన్ మద్యం సేవించి మోటారుసైకిల్ నడుపుతుండగా అదుపులోనికి తీసుకుని భీమవరం స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం హాజరు పర్చారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ ఎంవీఎన్ రాజారావు జరిమానా విధించారని నాగరాజు చెప్పారు.

మద్ది క్షేత్రంలో భక్తుల రద్దీ