
నాణ్యమైన ధాన్యమే సేకరించాలి
కొత్తకోట రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేసి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులదేనని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం సాయంత్రం కొత్తకోట, రాజపేటలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి వచ్చిన ధాన్యం, తేమ శాతం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ధాన్యంలో తాలు, గడ్డి అధికంగా కనిపించడంతో పెడస్టల్ ఫ్యాన్, ప్యాడీ క్లీనర్తో శుభ్రం చేసి కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. వచ్చిన ధాన్యం, తేమ శాతం తేదీల వారీగా నమోదు చేయాలని సూచించారు. వరి కోతలు సక్రమంగా జరిగేలా వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్ల నుంచి నాణ్యమైన బియ్యం అడుగుతున్నప్పుడు వారికి ధాన్యం కూడా అదేవిధంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజపేట కొనుగోలు కేంద్రంలో సరైన వసతులు లేకపోవడం, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు, సన్నరకం కేంద్రాలు వేర్వేరుగా నిర్వహించాలని, శిక్షణ పొందిన వారే ఇన్చార్జ్లుగా ఉండాలని ఆదేశించారు. అమరచింత కేంద్రం నుంచి రాజనగరంలోని రాఘవేంద్ర ఇండస్ట్రీకి ధాన్యం తరలించగా కలెక్టర్ రైస్మిల్లును సందర్శించారు. వరి ధాన్యాన్ని మరాడిస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. క్వింటాకు ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ సీఈఓ బాలరాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు.