
4,390 బాణసంచా దుకాణాలకు అనుమతి
కొరుక్కుపేట: దీపావళి పండుగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా 4,390 బాణసంచా దుకాణాలకు అనుమతి ఇచ్చినట్లు అగ్నిమాపక శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలు ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగ జరుపుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అగ్నిమాపక, పోలీసు శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిఉంది. ఆ విషయంలో, తమిళనాడు వ్యాప్తంగా 6,500 దుకాణ యజమానులు తమకు అనుమతి ఇవ్వాలని అగ్నిమాపక శాఖను కోరారు. అగ్నిమాపక శాఖ పేలుడు పదార్థాల రక్షణ చట్టం కింద తనిఖీ చేసి, అనుమతులు జారీ చేయడానికి ఆ శాఖ సిబ్బంది సంబంధిత ప్రదేశాలను స్వయంగా సందర్శించారు. గత శనివారం నాటికి, తమిళనాడు అంతటా మొత్తం 4,390 దుకాణాలకు అనుమతులు మంజూరు చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
విలువల ప్రోత్సాహంతో రూపాంతరన్ యాత్ర
సాక్షి, చైన్నె : సేవా ధృక్పథం, ఆరోగ్య అవగాహన, జీవి విలువలను ప్రోత్సహించడం, చాటడం లక్ష్యంగా ఆర్సీఎం రూపాంతరన్ యాత్ర సోమవారం చైన్నెలో జరిగింది. విభిన్న వర్గాల ప్రజలకు సాధికారత కల్పించేలా తమిళనాడులో ఆర్ఎసీఎం నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఆర్సీఎం 25వ వార్షికోత్సవంలో భాగంగా 100 రోజుల ప్రయాణంగా 17 వేల కి.మీ దూరం 75 నగరాల్లో 25 ప్రధాన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ఆ దిశగా చైన్నెలో సోమవారం ఆర్సీఎం రూపాంతరన్ యాత్ర జరిగింది. ఆరోగ్యం, సేవ, విలువలు, పర్యావరణ వ్యవస్థ, మహిళా సాధికారత, యువ నాయకత్వం వంటి అంశాలను ప్రస్తావిస్తూ చైన్నెలో యాత్రను నిర్వహించారు. తేనాం పేటలోని కామరాజర్ అరంగం, అన్నాసాలైలో జరిగిన ఈ యాత్రకు వందలాదిగా ప్రజలు తరలి వచ్చారు. ఉదయం ఆరోగ్య, సేవా అంశాలపై సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్సీఎం సీఈఓ మనోజ్కుమార్ మాట్లాడుతూ చైన్నె, తమిళనాడులో సమగ్ర సమాజ పురోగతి దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు.
ఎబిలిటీ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, చైన్నె : ఎబిలిటీ అవార్డులు 2026కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కెవిన్ కేర్ ప్రకటించింది. 24వ కెవిన్ కేర్ ఎబిలిటీ అవార్డుల ఎడిషన్ కోసం నామినేషన్లను ఆహ్వానించారు. కెవిన్ కేర్, ఎబిలిటీ ఫౌండేషన్లు ప్రతిభావంతులు, సాధకులను వెలుగులోకి తెచ్చేలా కథలు, ప్రోత్సాహం, అవార్డులతో ముందుకెతోంది. ఇందులో భాగంగా 2026లో ఎబిలిటీ అవార్డు ఫర్ ఎమినెన్స్, ఎబిలిటీ మాస్టరీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులకు అర్హులైన దివ్యాంగులు, ఇతర సాధకులు అక్టోబరు 30వ తేదీలోపు ఎబిలిటీ ఫౌండేషన్. ఓఆర్జీ, కెవిన్ కెర్ .కామ్ వెబ్ సైట్లలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
న్యాయమూర్తులపై విమర్శలా?
సాక్షి, చైన్నె : ఏదేని ఉత్తర్వులు ఇచ్చిన సమయంలో న్యాయమూర్తులను సైతం వదలి పెట్టకుండా సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించడం శోచనీయమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్కుమార్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఓ కేసు విచారణ సమయంలో ఆయన తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ఏ ఒక్కర్నీ వదలి పెట్టకుండా విమర్శలు, ఆరోపణలు గుప్పించే వారు పెరిగినట్టు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో జరిగిన ఘటనలను అస్త్రంగా చేసుకోవడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కోర్టులో ఉన్న న్యాయవాద సంఘం ప్రతినిధులు ప్రభాకర్, ఎంపీ సుధా, తదితరులు న్యాయమూర్తులకు న్యాయవాదులు ఎల్లప్పుడు అండగా ఉంటారని మద్దతు తెలిపారు.
జనవరిలో కీలంబాక్కం రైల్వేస్టేషన్ ప్రారంభం
కొరుక్కుపేట: కీలంబాక్కం రైల్వేస్టేషన్ జనవరిలో ప్రారంభం కానుంది. చైన్నెలో బస్ స్టాండ్ మొదట బ్రాడ్వేలో ఉండేది. తరువాత దాన్ని కోయంబేడుకు మార్చారు. ఇప్పుడు అది కీలంబాక్కంలో పనిచేస్తోంది. ఈ బస్ టెర్మినల్ వద్ద రైల్వేస్టేషన్ లేదు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ బస్ టెర్మినల్ చేరుకోవడానికి, ఎదురుగా కొత్త రైల్వే స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. తదనుగుణంగా, నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని ప్రారంభించాలని భావించారు. కానీ జనవరికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడైంది. ఏది ఏమైనా, ఈ రైల్వేస్టేషన్ సంక్రాంతికి ముందే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అనుసంధానించడానికి ఒక పాదచారుల ఓవర్పాస్ను కూడా నిర్మిస్తున్నారు. రైల్వేస్టేషనన్లోని ఒక ప్లాట్ఫామ్ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. పైకప్పు పనులు కూడా పూర్తయ్యాయి. మరో ప్లాట్ఫామ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.