
క్లుప్తంగా
తిరువొత్తియూరు: చైన్నె చూలైమేడుకు చెందిన ప్రతాప్, పల్లికరనైకు చెందిన జనార్థనన్, కీళ్కట్టలైకి చెందిన పూరణచంద్రన్, వేలచ్చేరికి చెందిన అబ్దుల్ వాసిం చైన్నె నగరంలో మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసి విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల ఖరీదైన గంజాయి, మత్తు మాత్రలు, రూ.2.65 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
కొరుక్కుపేట: పెరటాసి మాసం పవిత్ర దినాలలో ఉపవాసం ఉండి మాంసాహారానికి దూరంగా ఉండడం హిందువులు ఆచారం. దీని కారణంగా, కాశిమేడు చేపల మార్కెట్లో చేపల రాక తగ్గింది. సాధారణంగా, ఆదివారాల్లో, కాశీమేడు చేపల మార్కెట్ ఓ పండుగలాగా జనంతో నిండి ఉంటుంది. కానీ ఆదివారం, కాశీమేడు చేపల మార్కెట్లో చేపలు కొనే వారు కరువయ్యారు. చాలా పవర్ బోట్లు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లకపోవడంతో, తక్కువ మొత్తంలో చేపలు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. పెద్ద చేపలు సరఫరా కాలేదు. వంజీరం కిలో రూ.700, కొడువా రూ.600, శంకర రూ.300కు అమ్ముడయ్యాయి. చేపలు కొనేవారు లేక కాశీమేడు మార్కెట్ నిర్మానుష్యంగా మారిపోయింది. పురటాసి మాసం ముగిసేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
సాక్షి, చైన్నె: చైన్నె టీ నగర్లోని రామ్రాజ్ కాటన్ స్టోర్లో రమ్యం పేరిట చీరల కొలువు, ప్రీమియం సుభగా సిల్క్స్ కలెక్షన్లను సినీ నటి నదియా ఆవిష్కరించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు కేఆర్ నాగరాజన్, ఎండీ బీఆర్ అరుణ్ ఈశ్వర్, డైరెక్టర్లు సుమతి నాగరాజన్, ఆర్తిక అరుణ్ ఈశ్వర్, సినీ నటి ధనలక్ష్మి హాజరయ్యారు. రమ్యంను ఆవిష్కరించిన నటి నదియా సిల్క్స్ కలెక్షన్లను పరిచయం చేశారు. ఈసందర్భంగా బీఆర్ అరుణ్ ఈశ్వర్ మాట్లాడుతూ, రమ్యం వినియోగ దారులకు నచ్చే కలెక్షన్లతో ప్రత్యేక విభాంగా కొలువు దీర్చామని వివరించారు. తమ ఆవిష్కరణలు, రమ్యం సంప్రదాయ వస్త్రాలు, కొత్త డిజైన్లు, స్టైలీష్గా తీర్చిదిద్దిన భారతీయ హస్త కళల పాత్ర గురించి ఈ సందర్భంగా వివరించారు. పండుగ సీజన్ , రోజు వారీ అనువైన వస్త్రాల కొలువుగా ఇక్కడ రమ్యం ఏర్పాటైందన్నారు.
అన్నానగర్: మరైమలై నగర్ లోని తిరుచ్చి–చైన్నె జాతీయ రహదారిపై శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో, దాదాపు 10 ఆవులను తీసుకెళ్తున్న మినీ లారీ చైన్నె వైపు వేగంగా వచ్చింది. పోలీసులు లారీని ఆపమని సిగ్నల్ ఇచ్చారు. కానీ లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీని తరువాత, అక్కడ ఉన్న పోలీసులు కార్లు, మోటార్ సైకిళ్లలో లారీని వెంబడించారు. దాదాపు 2 కిలోమీటర్లు వెళ్లి మరైమలైనగర్ కారు ఫ్యాక్టరీ దగ్గర పట్టుకున్నారు. మిగతా ఇద్దరు పారిపోయారు. దర్యాప్తులో పట్టుబడిన యువకుడు హర్యాన రాష్ట్రానికి చెందిన ఖమర్ అలీ అని తేలింది. కాగా తప్పించుకునే క్రమంలో పశువుల అక్రమ రవాణాదారుల లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ, పెద్ద ప్రమాదం జరగలేదు. కాగా ఈ ఘటనపై మరై మలై నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొరుక్కుపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విల్లివాక్కం నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే బి . రంగనాథన్ అన్నారు. ఈ మేరకు చైన్నె మొగప్పేర్ వేస్ల్లో ఏడీకే స్పోర్ట్స్ అండ్ గేమింగ్ పావ్గేమర్స్ పార్కును ప్రముఖ నటుడు సతీష్ తోకలసి మాజీ ఎమ్మెల్యే బి. రంగనాథన్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతరం వారు మాట్లాడుతూ ప్రసుత్తం క్రీడాలకు ఆదరణ పెరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రతిభను చాటుకుంటే భవిష్యత్ను ఉజ్వలంగా మార్చుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సంస్థ సీఈవో డీజీ శ్రీనివాసన్ మాట్లాడుతూ ఏడికే స్పోర్ట్స్ అండ్ గేమింగ్ చైన్నెలో మొట్టమొదటి స్మార్ట్ స్పోర్టింగ్ అనుభవాన్ని పరిచయం చేస్తుందన్నారు. అంతేకాకుండా చైన్నెలో తొలి స్మార్ట్ పికిల్ బాల్ కోర్టు కావడం విశేషం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరుణ్కుమార్ పాల్గొన్నారు.

క్లుప్తంగా