
క్లుప్తంగా
కొరుక్కుపేట: బంగారు రథంపై కొలువై శ్రీవాసవీ అమ్మవారు భక్తులను కటాక్షించారు. చైన్నె జార్జిటౌన్లోని 300 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన శ్రీకన్యకాపరమేశ్వరీ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా 8వ రోజు సోమవారం ఉదయం వేదపండితుల వేదపారాయణం, శ్రీ కన్యకా పరమేశ్వరి మూలమంత్ర హోమం, అభిషేకాలు నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం శ్రీవాసవీ అమ్మవారిని బంగారు రథంపై కొలువుదీర్చి దూపదీపారాధనలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అంతకుముందు జి.నేహ గాత్ర కచేరీ, శ్రీసాయి నాట్యాలయ భరతనాట్య ప్రదర్శనలు, కీరవాణి బృందం భక్తిగీతాలాపనలు, ఊరా ఆంజనేయులు గాత్ర కచేరీ అమితంగా ఆకట్టుకున్నాయి. భక్తులందరికీ అన్నప్రసాదాలను అందించారు.
కొరుక్కుపేట: తూత్తుకుడి జిల్లా మేగ్నానపురంలోని చెమ్మరికులం కస్బాలో 8 అడుగుల పొడవు, 300 కిలోల బరువున్న మాజీ సీఎం పెరుంతలైవర్ కామరాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు మత్స్య, మత్స్యకారుల సంక్షేమం, మత్స్య శాఖ మంత్రి అనితా రాధాకష్ణన్ ప్రత్యేక అతిథిగా హాజరై కామరాజ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, కామరాజ్ పై ఒక పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప నాయకుడు కామరాజ్ అని, ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. మాజీ ప్రదాని స్వర్గియ ఇందిరా గాంధీ ప్రధానమంత్రి కావడానికి కామరాజ్ కారణం అని, మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయనే ప్రవేశపెట్టారన్నారు. ఆ పథకాన్ని ప్రస్తుతం సీఎం స్టాలిన్ అద్భుతంగా విస్తరించారని కొనియాడారు.
కొరుక్కుపేట: అంతర్జాతీయ స్థాయిలో తమ సేవలను విస్తరించడమే లక్ష్యంగా ముందుకెళుతామని సిన్సియర్ సిండికేషన్ సంస్థ సీఈఓ శివరామకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు చైన్నెలో సోమవారం సిన్సియర్ సిండికేషన్ మూడో కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణన్ మాట్లాడుతూ ప్రస్తుతం 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సిన్సియర్ సిండికేషన్, రెండు వందల కుటుంబాలకు విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందన్నారు. తమ ఉనికిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా మరింత విస్తరించాలనేది లక్ష్యమని పేర్కొన్నారు.
కొరుక్కుపేట: ఐఐటీమద్రాసు మేనేజ్మెంట్ విభాగం కొత్తగా రెండు సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ను లక్ష్యంగా చేసుకుని తీసుకుని వస్తున్న ఈ కోర్సు ఆధునిక వ్యాపారాలను నడిపించడానికి సమకాలీన నిర్వాహణ జ్ఞానాన్ని పొందుపరచడానికి వీలుగా ఈ కోర్సు తీసుకుని వచ్చినట్టు ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ సాజి కె.మాథ్యూ తెలిపారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. షార్ట్ లిస్టు చేయబడిన విద్యార్థులు నవంబర్ 8, 9వ తేదీల్లో ఐఐటీ మద్రాసు క్యాంపస్లో ఎంపిక ప్రక్రియ ద్వారా వెళుతారు. ఇందులో రాతపూర్వక ఆప్టిట్యూట్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. డిసెంబర్లో ఫలితాలు అందించబడి, జనవరి నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించా రు. అక్టోబర్ 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు htt p://doms.iitm.ac.in/admission/ చూడవచ్చునని వెల్లడించారు.
తిరువొత్తియూరు: భారత రెడ్క్రాస్ సొసైటీ తమిళనాడు శాఖ ఆధ్వర్యంలో ఎగ్మూరులోని కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రెడ్క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు జస్టిస్ జయచంద్రన్ ప్రారంభించారు. రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, గవర్నర్ ఆర్.ఎన్.రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ న్యాయ కళాశాల విద్యార్థులు, పనిమలర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, రెడ్క్రాస్ సొసైటీ ఉద్యోగులు వంద మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు కృష్ణన్, కార్తి నారాయణన్, ఆత్మనాథన్, ఓం ప్రకాష్, శంకర్ ప్రకాష్, థామస్ జాన్ పాల్గొన్నారు.

క్లుప్తంగా