
పూరి గుడిసె దగ్ధం
● రూ.2 లక్షల ఆస్తి నష్టం
యర్రగొండపాలెం: స్థానిక గాయత్రి థియేటర్కు సమీపంలో ఉన్న పూరిగుడిసె మంగళవారం అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ సంఘటనలో దాదాపు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాలు.. బేల్దారి పనులు పనిచేసుకునే పోలేపల్లి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఆరుబయట కూర్చుని టిఫిన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుడిసెకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమై మంటలు ఆర్పేలోగా గుడిసెతోపాటు ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. బ్యాంకులో పొదుపు గ్రూపు ఖాతా నుంచి డ్రా చేసుకుని వచ్చిన రూ.80 వేల నగదు, టీవీ, బీరువా, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు అదుపు చేశారు. తక్షణ సహాయం కింద చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు రూ.8,500 నగదును బాధిత కుటుంబానికి అందజేశారు.