పశ్చిమంపై శీతకన్ను | - | Sakshi
Sakshi News home page

పశ్చిమంపై శీతకన్ను

Apr 28 2025 12:49 AM | Updated on Apr 28 2025 12:49 AM

పశ్చి

పశ్చిమంపై శీతకన్ను

వెలుగొండను త్వరగా పూర్తిచేయాలి

వెలుగొండ ప్రాజెక్టును ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. పోలవరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో.. వెలుగొండకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వరద సీజన్‌లోనే కృష్ణా జలాలను వెలుగొండ ద్వారా ఈ ప్రాంతానికి అందించాలి. కనీసం రూ.1500 కోట్లు కేటాయిస్తేనే ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందుతాయి. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి త్వరగా ముంపు గ్రామాల ప్రజలను కాలనీలకు తరలించాలి.

– సోమయ్య, సీపీఎం నాయకులు

ఆగిన మెడికల్‌ కళాశాల భవనాలు

పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. వెలుగొండ ప్రాజెక్టు..మెడికల్‌ కాలేజీ..మార్కాపురం జిల్లా.. ఇలా ఏ ఒక్క అభివృద్ధి పనినీ పట్టించుకోకుండా తీరని ద్రోహం చేస్తోంది. వెలుగొండ ప్రాజెక్టుకు అరకొర నిధులు కేటాయించగా..మెడికల్‌ కాలేజీ నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపేసింది. ఇక మార్కాపురం జిల్లా చేస్తామన్న ఊసే మరిచిపోయింది. ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.

మార్కాపురం:

జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో గత ప్రభుత్వంలో వడివడిగా సాగిన అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి ప్రొఫెసర్లను నియమించారు. పెద్దదోర్నాలలో గిరిజన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చేశారు.

పొదిలి పెద్దచెరువు నిర్మాణానికి రూ.50 కోట్లు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన మెడికల్‌ కళాశాల నిర్మాణం నిలిచిపోయింది. జిల్లా వైద్యశాల నుంచి జీజీహెచ్‌గా మారి అత్యున్నతమైన కార్పొరేట్‌ వైద్య సేవలను ఉచితంగా పేద ప్రజలకు అందించే హాస్పిటల్‌కు నేడు రోగులు కరువయ్యారు. సుమారు 45 మందికి పైగా వైద్యులను బదిలీ చేసిన ప్రభుత్వం వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో వైద్యసేవల కోసం మళ్లీ యధావిధిగా గుంటూరు, ఒంగోలుకు వెళ్తున్నారు. ప్రస్తుతం 22 మంది వైద్యులు మాత్రమే సేవలు అందిస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు కలిపి 75 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్‌ కాలేజీని అర్ధంతరంగా ఆపడంతో పాటు పీపీపీ విధానంలో చేస్తామంటూ చేసిన ప్రకటన కూడా వాస్తవ రూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వ తీరుపై ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కలగా మారిన జిల్లా ఏర్పాటు:

గత ఎన్నికలకు ముందు మార్కాపురాన్ని జిల్లాగా చేసి సీఎంగా మార్కాపురం వస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు హామీ నెరవేర్చకుండానే మార్చి 8న మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరయ్యారు.

అప్పుడు కూడా ప్రజలు అడిగిన ప్రశ్నలకు కచ్చితంగా జిల్లా చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఎప్పట్లోగా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కలెక్టర్‌, ఎస్‌పీ, అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌, జేడీలు, వైద్యశాఖ డీఎంహెచ్‌ఓ, ఇతర సంక్షేమ శాఖల ఈడీలు ఇక్కడే ఉండి అభివృద్ధిని పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతోపాటు జిల్లా ఏర్పాటైతే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులొస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా మార్కాపురానికి వస్తుంది.

హామీలు మరిచి అభివృద్ధికి పాతరేసిన కూటమి ప్రభుత్వం ఆగిన మెడికల్‌ కళాశాల నిర్మాణం జీజీహెచ్‌లో వైద్యుల కొరత వెలుగొండకు అరకొర నిధులు ఏర్పాటుకాని మార్కాపురం జిల్లా

మెడికల్‌ కాలేజీని పూర్తిచేయాలి

రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీని త్వరగా పూర్తిచేయాలి. ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలి. పీపీపీ విధానం వద్దు. జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. మార్కాపురాన్ని జిల్లా చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.

– గాలి వెంకటరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు

వెలుగొండకు అరకొర నిధులు

అధికారంలోకి రాగానే వెలుగొండను పూర్తిచేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. ముంపు గ్రామాల ప్రజల ఆర్‌ఆర్‌ ప్యాకేజీల కోసం కనీసం రూ.1200 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వం కేటాయించిన నిధులు సిబ్బంది జీతభత్యాలకు, అరకొర పనులకు మాత్రమే ఉపయోగపడతాయి. మరోవైపు ప్రాజెక్టును 2026కు పూర్తిచేస్తామని చెబుతున్నా నిధుల కేటాయింపు జరగకపోవడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

పశ్చిమంపై శీతకన్ను1
1/4

పశ్చిమంపై శీతకన్ను

పశ్చిమంపై శీతకన్ను2
2/4

పశ్చిమంపై శీతకన్ను

పశ్చిమంపై శీతకన్ను3
3/4

పశ్చిమంపై శీతకన్ను

పశ్చిమంపై శీతకన్ను4
4/4

పశ్చిమంపై శీతకన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement