రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు

Apr 28 2025 12:49 AM | Updated on Apr 28 2025 12:49 AM

రెచ్చ

రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు

ముండ్లమూరు (కురిచేడు):

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ పెట్రేగిపోతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. పిల్లల పెళ్లిల్లు, చదువులు, ఇతర అవసరాల కోసం ప్రజలు దాచుకున్న నగదును దోచేస్తున్నారు. సంబంధిత బ్యాంకుల నుంచి ఖాతాదారులకు సకాలంలో మెసేజ్‌లు కూడా రాకపోతుండటంతో వెంటనే అప్రమత్తం కాలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మళ్లీమళ్లీ సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ముండ్లమూరులో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనంగా ఉంది. స్థానిక మోడల్‌ పాఠశాలలో సివిక్స్‌ బోధించే ఉపాధ్యాయుడు ఎర్రబోయిన వెంకట సుబ్బారావు తన కుమారుడు అబ్రాడ్‌లో చదువుతుండటంతో అతని చదువు కోసం బ్యాంకులో నగదు దాచుకున్నారు. ఆ నగదులో 5,18,000 రూపాయలను సైబర్‌ నేరగాళ్లు దోచుకుని ఖాతా ఖాళీ చేశారు. ఈ నెల 23వ తేదీ వెంకట సుబ్బారావు స్థానిక ఏపీజీబీ ఏటీఎంలో రెండు దఫాలుగా రూ.10,000, రూ.2,000 డ్రా చేశారు. అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు అతని ఫోన్‌కు రూ.48,000 డ్రా చేసినట్లు మెసేజ్‌ వచ్చింది. దాన్ని చూసి వెంకట సుబ్బారావు ఆందోళనకు గురయ్యారు. దర్శి స్టేట్‌ బ్యాంకులో గల అతనికి ఖాతాకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్‌ కోసం వెంటనే దర్శి వెళ్లారు. అక్కడున్న ఎస్‌బీఐ ఏటీఎంలో మినీ స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. అప్పుడుగానీ వెంకట సుబ్బారావుకు అసలు విషయం అర్థంకాలేదు. తాను నగదు డ్రా చేయకముందే మూడు సార్లు నగదు డ్రా చేసినట్లు మినీ స్టేట్‌మెంట్‌ రావడం చూసి నివ్వెరపోయారు. ఒకరోజు ముందుగానే ఒకసారి రూ.2.5 లక్షలు ఐడీబీఐ బ్యాంకుకు పంపినట్లు, మళ్లీ రూ.20 వేలు ఏటీఎం ద్వారా డ్రా చేసినట్లు, మూడోసారి రూ.2 లక్షలు ఐడీబీఐ బ్యాంకుకు పంపినట్లు మినీ స్టేట్‌మెంట్లో ఉంది. కానీ, వీటిలో ఏ ఒక్కదానికీ మెసేజ్‌ రాలేదు. తాను విత్‌ డ్రా చేసిన వాటికి కూడా మెసేజ్‌ రాలేదు. ఆ తర్వాత రూ.48,000 డ్రా చేసినట్లు మాత్రం మెసేజ్‌ వచ్చింది. కుమారుడి చదువు కోసం దాచుకున్న మొత్తంలో 5,18,000 రూపాయలను సైబర్‌ నేరగాళ్లు కాజేయడంతో వెంకట సుబ్బారావు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని బ్యాంక్‌ అధికారులు, పోలీసులు...

సైబర్‌ నేరగాళ్లు తన బ్యాంక్‌ ఖాతాలోని రూ.5,18,000 దోచేయడంపై ఉపాధ్యాయుడు వెంకట సుబ్బారావు ఈ నెల 24వ తేదీ దర్శి స్టేట్‌ బ్యాంకు మేనేజర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కానీ, అక్కడ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తన ఖాతా నుంచి నగదును సైబర్‌ నేరగాళ్లు ఏ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశారనే వివరాలడిగినా స్పందించలేదని చెప్పారు. తన నగదును సైబర్‌ నేరగాళ్లు కాజేశారని సర్టిఫికెట్‌ ఇవ్వమన్నా ఇవ్వలేదని, అకౌంటెంట్‌కు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన బ్యాంకు ఖాతాను బ్లాక్‌ చేయించినట్లు తెలిపారు. బ్యాంకు వారిపై నమ్మకం లేక ఈ నెల 25వ తేదీ ఆ ఖాతాలో ఉన్న మిగతా నగదును డ్రా చేసి జాగ్రత్త చేసుకున్నట్లు చెప్పారు. మొదటిసారి నగదు ట్రాన్స్‌ఫర్‌ కాగానే తన సెల్‌కు బ్యాంకు నుంచి మెసేజ్‌ వచ్చి ఉంటే వెంటనే అప్రమత్తమై బ్యాంకు ఖాతాను బ్లాక్‌ చేయించి కొంతవరకై నా నగదు నష్టపోకుండా కాపాడుకునేవాడినని, కానీ, మెసేజ్‌లు రావడం ఆలస్యం కావడం వలన పూర్తిగా నగదు నష్టపోవాల్సి వచ్చిందని సుబ్బారావు పేర్కొన్నారు. అనంతరం 1930కి ఫిర్యాదు చేశానని తెలిపారు. ముండ్లమూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. ఎస్సై లేరని, ఆయన వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకుంటామని సిబ్బంది చెప్పడంతో వెనక్కు వచ్చినట్లు ఆయన తెలిపారు. తన బ్యాంకు ఖాతా నుంచి మాయమైన నగదును సైబర్‌ నేరగాళ్ల నుంచి రికవరీ చేసి తనకు ఇప్పించాలని, తన కుమారుడి చదువు ఆగిపోకుండా ఆదుకోవాలని సుబ్బారావు విజ్ఙప్తి చేశారు.

ఓ ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా ఖాళీ

రూ.5,18,000 దోచేసిన వైనం

కుమారుడి చదువు కోసం దాచుకున్న నగదు మాయం కావడంతో తీవ్ర ఆవేదనలో బాధితుడు

రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు 1
1/1

రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement