
పొగాకు రైతులను ఆదుకోవాలి
● వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు డిమాండ్
ఒంగోలు టౌన్: మార్కెఫెడ్ను రంగంలోకి దింపి పొగాకు రైతులను ఆదుకోవాలని, లేకుంటే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన త్రోవగుంట వద్ద ఉన్న పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని పార్టీ నాయకులు, పొగాకు రైతులతో కలిసి సందర్శించి అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేకుంటే పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడి వచ్చిందని ధరలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మన రాష్ట్రంలో అధిక వర్షాలతో ఒకటికి రెండు సార్లు నాట్లు వేశారని, కలుపు పెరగడం, మల్లె వేయడం వల్ల దిగుబడి తక్కువగా వచ్చిందన్నారు. పంట ఖర్చులు పెరిగాయని, కూలి రేట్లు కూడా పెరిగాయని రైతులు చాలా నష్టపోయారని వివరించారు. ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, నిరుపేద రైతులు అధిక కౌలుకు బ్యార్నీలు తీసుకొని పంట వేశారని, ప్రస్తుత మార్కెట్ మాయాజలంలో నెగ్గుకురాలేక కంట కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017–18లో నాటి తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే జరగడంతో అనేక మంది పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతదేహాలను పొగాకు బోర్డు వద్ద పెట్టి రైతులు ఆందోళనకు దిగారని, రైతులకు మద్దతుగా నిలబడి ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెట్టి వేధించారని చెప్పారు. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు నాటి పరిస్థితే పునరావృతమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేస్తేనే రైతులు నష్టాల ఊబి నుంచి బయట పడతారని చెప్పారు. పొగాకు రైతులు తొందరపడి తక్కువ ధరలకు పంటను అమ్ముకోవద్దన్నారు. అవసరమైతే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతులకు అండగా వచ్చి నిలబడతారని తెలిపారు. త్వరలోనే రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పొగాకు బోర్డును సందర్శించి రైతులతో మాట్లాడతారని తెలిపారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ధరల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, నాగులప్పలపాడు మండల అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, మద్దిపాడు మండల ఉపాధ్యక్షుడు కోటిరెడ్డి, పలువురు ఎంపీపీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.