
ఆక్రమణల తొలగింపులో ‘పచ్చ’పాతం
నరసరావుపేట: పట్టణంలో మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్న ఆక్రమణల తొలగింపులో ‘పచ్చ’పాతం చూపిస్తున్నారనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. గత సోమవారం నుంచి పల్నాడు రోడ్డులో ఆక్రమణల తొలగింపును మున్సిపల్ పట్టణ ప్రణాళికా అధికారి సాంబయ్య నేతృత్వంలో సిబ్బంది జేసీబీ సహాయంతో నిర్వహిస్తున్నారు.
మరీ ఇంత దారుణమా?
పల్నాడు రోడ్డులోని బస్సులు, ఇతర వాహనాలు ఆగే ప్రాంతంలో రోడ్డుకు దక్షిణం వైపు మెడికల్ షాపు, టీ షాపుల ముందున్న మెట్లు డ్రైనేజీపై నిర్మించారనే కారణంతో తొలగించారు. దీంతో వినియోగదారులు కనీసం షాపుల్లోకి వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దాని ముందు నిర్మించిన బస్షెల్టర్ రోడ్డుపైకి ఆరడుగులు ముందుకు చొచ్చుకొచ్చినా జోలికి వెళ్లలేదు. దానికి పసుపురంగు పులిమి ఉండటమే కారణంగా భావిస్తున్నారు. దానికి సమీపంలో టీడీపీ రంగులతో కోడి పలావ్ పేరుతో రోడ్డుపైకి నిర్మించిన కట్టడాన్ని అధికారులు ముట్టుకోలేదు. దానికి ఇరువైపులా షాపుల ముందున్న చిన్నపాటి నిర్మాణాలను తొలగించారు. ఈ ప్రాంతం చూసిన ఎవరికై నా పక్షపాతం ఎలా ఉందో అర్థమవుతుంది.
అందరివీ తొలగిస్తాం
పల్నాడు రోడ్డులో చేపట్టిన ఆక్రమణల తొలగింపులో ఎవరి ఒత్తిళ్లు పట్టించుకోవట్లేదు. ఒక బిర్యాని హోటల్ తొలగింపులో అధికార, ప్రతిపక్షాల నుంచి ఆ పని వద్దని అభ్యర్థనలు వచ్చినా ఖాతరు చేయలేదు. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా వ్యవహరిస్తున్నాం. ఆక్రమణలు అన్నింటినీ తొలగిస్తాం.
– కె.సాంబయ్య, పట్టణ ప్రణాళికా అధికారి
టీడీపీ రంగులు ఉంటే
ముట్టుకోని అధికారులు

ఆక్రమణల తొలగింపులో ‘పచ్చ’పాతం