
పర్యాటకులపై ఉగ్రదాడికి ఖండన
కోలారు: కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని హత్య చేయడాన్ని ఖండిస్తూ సోమవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి, ఎర్ర బ్యాడ్జీలు ధరించి కోర్టు ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీకి ముందు ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మునేగౌడ మాట్లాడుతూ శాంతిప్రియులైన భారతీయులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఖండనీయమన్నారు. ఉగ్రవాదులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం కశ్మీర్లో 370 ఆర్టికల్ను తొలగించి కశ్మీర్ భారతదేశ అవిభాజ్య అంగమని తెలియజేసిందన్నారు. ర్యాలీలో కార్యదర్శి భైరారెడ్డి, ఉపాధ్యక్షుడు రవీంద్రబాబు, కోశాధికారి నవీన్, కె వి శంకరప్ప, బిసప్పగౌడ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల బైక్ ర్యాలీ
ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన