
మలేరియా నివారణపై జాగృతి జాతా
హొసపేటె: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవంపై జాగృతి జాతాను నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా ఆర్సీహెచ్ఓ అధికారి డాక్టర్ జంబయ్య నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించాలన్నారు. దోమ కాటుకు వ్యతిరేకంగా నివారణ చర్యలుగా దోమతెరలు, వేప పొగను ఉపయోగించాలని సూచించారు. దోమల బెడదను అరికట్టి మలేరియా వ్యాధి సోకకుండా కాపాడుకోవాలని కోరారు. అదే విధంగా నీరు నిల్వ చేయకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ర్యాలీని ఆస్పత్రి ఆవరణ నుంచి ప్రారంభించి ప్రముఖ వీధుల గుండా బయలుదేరి అంబేడ్కర్ సర్కిల్ వరకు చేపట్టారు. జిల్లా ఆరోగ్య విద్యాధికారి ఎం.దొడ్డమని, వైద్యులు సతీష్, బసవరాజ్, జిల్లా ఆరోగ్య ఇన్స్పెక్టర్ ఎం.ధర్మనగౌడ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
మలేరియాను పారదోలదాం
రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నియంత్రణకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ నోడల్ అధికారిణి సంధ్య పిలుపునిచ్చారు. ఆమె రాగిమానుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రపంచ మలేరియా దినోత్సవ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి గురించి అవగాహన పెంచుకుని దాని నియంత్రణకు ముందుకు రావాలన్నారు.

మలేరియా నివారణపై జాగృతి జాతా