అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ

Apr 25 2025 8:08 AM | Updated on Apr 25 2025 8:08 AM

అభివృ

అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలె మహదేశ్వర బెట్టలో గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దృష్ట్యా బెంగళూరు కేంద్రిత పాలనకు బదులుగా కర్ణాటక అంతటా పాలనా వికేంద్రీకరణ మోడల్‌ను అలవరచుకోవాలని ఉద్దేశించారు. అందువల్లే కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవం రోజున కలబురగిలో కేబినెట్‌ భేటీ నిర్వహించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈ దఫా మైసూరు ప్రగతి సాధన దిశగా మలెమహదేశ్వర బెట్టలో కేబినెట్‌ భేటీ నిర్వహించి 82కు పైగా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మొదట జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించినవారి గౌరవార్థం సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత చర్చ ఆరంభమైంది. చిన్న నీటిపారుదల, జలవనరుల శాఖల ద్వారా 29 పనులను రూ.1,787 కోట్ల వ్యయంతో చేపట్టాలని తీర్మానించారు. దీంతో మైసూరు రెవెన్యూ విభాగంలోని జిల్లాల్లో జలాశయాలు, చెరువులు, కాలువల అభివృద్ధితో ఈ ప్రాంతంలో నీటిపారుదల కార్యకలాపాలను సమగ్రంగా చేపట్టేందుకు వీలవుతుంది. పరోక్షంగా మనిషి, ఏనుగుల దాడులను అరికట్టేందుకు రూ.210.2 కోట్లను కేటాయించారు. ఈ ప్రాంత నగరాల్లో ప్రజలకు మంచినీటి పథకాల కోసం నగరాభివృద్ధి శాఖ నుంచి రూ.315 కోట్ల నిధులతో రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తీర్మానించారు. మైసూరు, చామరాజనగర జిల్లాల ప్రజల ఆరోగ్య రక్షణకు రూ.228 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి రూ.300 కోట్లను కేటాయించాలని తీర్మానించారు. చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకా చిక్కకల్లూరులో మంటెస్వామి, రాచప్పాజి, సిద్దప్పాజి క్షేత్రాల అభివృద్ధి ప్రాధికార ఏర్పాటు చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు.

మైసూరు ఎయిర్‌పోర్టు అప్‌గ్రేడ్‌

మైసూరులోని ఇలవాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాంగణం నిర్మాణం, రన్‌వే విస్తరణతో పాటు మైసూరు విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్‌ చేయాలని తీర్మానించారు. ఈ జిల్లాల్లో గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ దీపాలతో సహా మౌలిక సౌకర్యాలను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలను సత్వరం కార్యరూపానికి తెస్తామని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీతో పుణ్యక్షేత్రంలో అధికారుల హడావుడి నెలకొంది.

ఆ దిశగా వివిధ జిల్లాల్లో కేబినెట్‌ భేటీలు

మలె మహదేశ్వర బెట్టలో మంత్రివర్గ సమావేశం

ఆ ప్రాంత ప్రగతికి పలు నిర్ణయాలు

అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ1
1/2

అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ

అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ2
2/2

అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement