
కులగణన అస్త్రం బూటకం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన పేరుతో రెండు లక్షల జనాభాకు బదులుగా కేవలం నాలుగు వేల మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొనడం విడ్డూరంగా ఉందని మాజీ శాసన సభ్యుడు, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు పాపారెడ్డి ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాలో 75 వేల మంది జనాభా ఉండగా కేవలం 4,280 మంది ఉన్నట్లు పేర్కొనడం తగదన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవిని కాపాడుకోడానికి కుట్ర పన్నారని, రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు పదవిని రక్షించుకోవడానికి నాటకమాడుతున్నట్లు తెలిపారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదిక అందించారన్నారు. ఏనాడూ ఏ అధికారి కులగణన సమీక్షకు రాలేదన్నారు. మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. బసవరాజరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రెడ్డి, కృష్ణమూర్తిలున్నారు.