
రెవెన్యూ సదస్సులు కీలకం
భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్: భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు కీలకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన భూ భారతి సహాయక కేంద్రాన్ని, భూపాలపల్లి మండలం వజినపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కేంద్రంలో సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి సదస్సులు దోహదపడుతాయని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను సమయానికి పరిశీలించి, సంబంధిత తహసీల్దార్కు సిఫారసు చేసి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు హరిహర, శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు చర్యలు తీసుకోవాలి..
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్, డీఆర్డీఓ, విద్యా, ఆర్డబ్ల్యూఎస్, సంక్షేమ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వచ్చాక తదుపరి చికిత్సలు చేయడం కంటే రాకుండా ముందస్తు చర్యలు చాలా ముఖ్యమని తెలిపారు. వానాకాలంలో మలేరియా, పైలేరియా, మెదడు వాపు, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు అన్ని పరీక్షలు నిర్వహిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని స్పష్టంచేశారు. ప్రతీ శుక్రవారం ప్రతీ కుటుంబం తప్పనిసరిగా డ్రైడే పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ వల్ల దోమల వ్యాప్తి జరుగుతుందని, ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. దోమలు వ్యాప్తి జరుగకుండా ఫాగింగ్ చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పీహెచ్సీల్లో ర్యాపిడ్ టీములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ మధుసూదన్, ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీకాంత్, డీపీఓ వీరభద్రయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం సదస్సులు
కాటారం: గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. మంగళవారం బయ్యారం, ఆదివారంపేట గ్రామాల్లో కొనసాగిన రెవెన్యూ సదస్సులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. బయ్యారంలో 185, ఆదివారంపేటలో 34 దరఖాస్తులు వచ్చినట్లు తహశీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ సదస్సుల్లో నయాబ్ తహశీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ వెంకన్న పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రతీ శుక్రవారం డ్రై డేగా నిర్వహించాలి
కలెక్టర్ రాహుల్ శర్మ

రెవెన్యూ సదస్సులు కీలకం

రెవెన్యూ సదస్సులు కీలకం