
ఈసారైనా.. కొలిక్కొచ్చేనా?
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కోసం సేకరించే భూమికి పరిహారం ఇచ్చే విషయంలో ఇటు అధికారులు, అటు నిర్వాసితుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమైనప్పటికీ సంతృప్తికర చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన నేడు (బుధవారం) కలెక్టరేట్లో మరోమారు సమావేశం కానుండడంతో ఈసారైనా పరిహారం విషయం కొలిక్కివస్తుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత వ్యవసాయ భూములు కోల్పోతున్న నక్కలపల్లి (131 ఎకరాలు), గాడిపల్లి (110 ఎకరాలు) రైతులతో నేడు కలెక్టరేట్లో సమావేశం కానున్నారు. మరుసటి రోజు (గురువారం) నాన్ లేఅవుట్ ప్లాట్ల యజమానులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే మామునూరు విమానాశ్రయం కోసం 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉండగా.. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన మరో 253 ఎకరాల విషయంలో గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి రైతులను ఒప్పించడమే అధికారులకు పెద్ద టాస్క్గా మారింది. ఈప్రాంతంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.పది లక్షలుంటే.. బహిరంగ మార్కెట్లో రూ.కోటిన్నర నుంచి రూ.మూడు కోట్ల వరకు ఉండడంతో రైతులు తమకు న్యాయంగా పరిహారం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎకరానికి ప్రభుత్వం జనరల్ అవార్డు కింద రూ.65 లక్షలు చెల్లించనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కనీసం రూ.కోటిన్నర వరకై నా చెల్లించాలని రైతులు అంటున్నారు. మరికొందరు రైతులు భూమికి బదులు భూమి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్తో బుధవారం జరిగే చర్చలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కన్సంట్ అవార్డు కింద కలెక్టర్ తనకున్న అధికారాన్ని వినియోగించి ఎకరానికి రూ.98 లక్షలు ఇచ్చే యోచనలో ఉన్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాగా, భూసేకరణ చట్ట ప్రకారం తమకున్న పరిధిలో రైతులకు న్యాయం చేసేలా చూస్తామని, సాధ్యసాధ్యాలపై ఉన్నతాధికారులు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వర్రావు తెలిపారు.
మామూనూరు విమానాశ్రయ
స్థలసేకరణలో జాప్యం
భూనిర్వాసితులతో ఇప్పటికే
మూడుసార్లు సమావేశం
బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్
నేడు మరోసారి చర్చించనున్న కలెక్టర్, రెవెన్యూ అధికారులు