రేగొండ: జిల్లా కేంద్రంతో పాటు రేగొండ, కాటారం, మహాముత్తారం మండలాల్లో బుధవారం రాత్రి అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులకు జిల్లా కేంద్రంలోని సుభాష్కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ వద్ద చెట్టు కారుపై పడడంతో కారు ధ్వంసమైంది. ఎస్ఎం కొత్తపల్లిలో కర్ణాటకపు రమేష్కు చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. రేగొండ మండలం కొత్తపల్లి (బీ)లో ఇంటి రేకులు గాలికి కొట్టుకుపోయాయి. బాగిర్తిపేట క్రాస్ రోడ్డు నుంచి మూల కొత్తపల్లి వరకు రోడ్డుకిరువైపులా చెట్టు నేలవాలడంతో ఎస్సై సందీప్కుమార్ చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు.
భూపాలపల్లి, రేగొండ, మహాముత్తారం, కాటారం మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహాముత్తారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపడింది. దీంతో కేంద్రం వద్ద ఉన్న రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.