
ఆధ్యాత్మిక కేంద్రం ముమ్మిడివరం
ముమ్మిడివరం: తూర్పు, దక్షిణాన సాగర సంగమ సోయగాలు.. ఉత్తరాన గౌతమీ గోదావరి పరవళ్లు.. పడమరన కోనసీమ కేంద్రమైన అమలాపురం నియోజకవర్గ సరిహద్దులు.. ఇదీ ముమ్మిడివరం నియోజకవర్గం నైసర్గిక స్వరూపం. జిల్లాలో చిట్టచివరి నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరం ఇద్దరు రాజకీయ ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టడం, అనంతరం లోక్సభ స్పీకర్ కావడం ఈ నియోజకవర్గానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఆరుసార్లు గెలిచి జిల్లాలో రికార్డు సృష్టించిన మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు ముమ్మిడివరం నుంచి రెండు సార్లు గెలుపొందడం మరో విశేషం. ముమ్మిడివరం నియోజకవర్గం ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. 40 ఏళ్లు నిద్రాహారాలు మాని కఠోర తపస్సు నాచరించిన శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమం ఇక్కడే ఉంది.
నియోజకవర్గ స్వరూపం
చెయ్యేరు జనరల్ నియోజకవర్గం 1978లో ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలో చేరింది. 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ నియోజకవర్గం జనరల్గా మారింది. అంతకు ముందు చెయ్యేరు నియోజక వర్గంగా ఉన్న సమయంలో నాలుగు సార్లు ఎన్నికలు జరగగా కాపు, క్షత్రియ సామాజిక వర్గాలు రెండేసి పర్యాయాలు ప్రాతినిథ్యం వహించాయి. మొదటిసారి 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నడింపల్లి రామభద్రిరాజు సీపీఐ అభ్యర్థి సి.కృష్ణమూర్తిపై 8,637 ఓట్లతో గెలుపొందారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సీబీకే రాజుపై కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావు 2,066 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావును స్వతంత్ర అభ్యర్థి సీబీకే రాజు 15,365 ఓట్ల తేడాతో ఓడించారు. 1972లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి పళ్ళ వెంకటరావు ఇండింపెండెంట్ అభ్యర్థి జీవీ రావుపై 11,304 ఓట్ల తేడాతో గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.
రసవత్తర రాజకీయ పోరు
1978లో చెయ్యేరు నియోజకవర్గం ముమ్మిడివరం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి బి.అప్పలస్వామిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 13,228 ఓట్లతో గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1983లో టీడీపీ అభ్యర్థి వల్తాటి రాజా సక్కుబాయిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 36,225 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి జీకే వరప్రసాద్ను టీడీపీ అభ్యర్థి పండు కృష్ణమూర్తి 33,124 ఓట్ల తేడాతో ఓడించారు. 1989లో టీడీపీ అభ్యర్థి పండు కృష్ణమూర్తిపై కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు 6,749 ఓట్లతో విజయం సాధించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన సుబ్బారావు టీడీపీ అభ్యర్థి మోకా ఆనందసాగర్పై 9,565 మెజార్టీతో రెండో సారి గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా జిల్లాలో రికార్డు సృష్టించారు. బత్తిన మరణానంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావుపై టీడీపీ అభ్యర్థి జీఎంసీ బాలయోగి 14,496 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. 1998లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో బాలయోగి అమలాపురం ఎంపీగా గెలుపు పొందడంతో మరోసారి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్పై టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానంద 17,778 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వరూప్పై వివేకానంద మరోసారి 10,742 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చెల్లి శేషకుమారిపై కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ 15,357 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన తరువాత 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వుడుగా ఉన్న ఈ నియోజవర్గం జనరల్గా మారింది. అప్పట్లో పీఆర్పీ పార్టీ ఆవిర్భావంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్కుమార్, టీడీపీ అభ్యర్థిగా నడింపల్లి శ్రీనివాసరాజు, పీఆర్పీ అభ్యర్థిగా కుడిపూడి సూర్యనారాయణరావులు పోటీ పడగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్కుమార్ 2,234 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుత్తుల సాయిపై టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 29,535 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో జరిగిన జరిగిన ఎన్నికల్లో టీడీపీ అఽభ్యర్థి దాట్ల బుచ్చిబాబుపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్కుమార్ 5,547 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా లబ్ధిదారులకు చేకూరిన లబ్ధి
పథకం లబ్ధిదారులు లబ్ధి(రూ.కోట్లలో)
వైఎస్సార్ పెన్షన్ కానుక 47,054 233.57
జగనన్న అమ్మ ఒడి 25,583 118.60
వైఎస్సార్ చేయూత 11,240 64.50
వైఎస్సార్ ఆసరా 10,314 160.00
వైఎస్సార్ రైతు భరోసా 24,050 98.18
వైఎస్సార్ డ్వాక్రా సున్నా వడ్డీ 3,500 8.73
వైఎస్సార్ కాపు నేస్తం 3,269 9.14
ఉచిత పంటల బీమా 6,840 29.15
జగనన్న విద్యా దీవెన 6,007 17.49
జగనన్న వసతి దీవెన 6,456 18.54
వైఎస్సార్ నేతన్న నేస్తం 416 5.80
వైఎస్సార్ ఈబీసీ నేస్తం 519 4.19
వైఎస్సార్ బీమా క్లెయిమ్ 35 4.31
రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ 757 12.71
వైఎస్సార్ రైతు సున్నా వడ్డీ 3,500 7.86
వైఎస్సార్ వాహన మిత్ర 1,217 .81
మొత్తం 1,50,757 795.58
ఇతర పథకాలు
జగనన్న చేదోడు 541 3.67
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 414 0.55
కోవిడ్ సాయం 33,714 2.71
వైఎస్సార్ మత్స్యకార భరోసా 23,242 73.55
అగ్రిగోల్డ్ 2,010 0.48
వైఎస్సార్ లానేస్తం 6 0.03
వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా 164 1.08
అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు సాయం 114 0.18
జగనన్న విదేశీ విద్యా దీవెన 1 0.15
మొత్తం 60,206 82.40
నాన్ డీబీటీ పథకాల లబ్ధి
జగనన్న తోడు 1240 1.24
వైఎస్సార్ సంపూర్ణ పోషణ 29,040 3.70
జగనన్న గోరుముద్ద 12,543 34.34
జగనన్న విద్యా కానుక 61,350 14.84
ఇళ్ల స్థలాల భూసేకరణ, పరిహారం, చెల్లింపు 7,654 8.19
మొత్తం 1,11,827 62.31
నిత్య కల్యాణం పచ్చతోరణంగా మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం
బాలయోగి తపో ఆశ్రమానికి
దేశవిదేశాల నుంచి భక్తుల రాక
పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న కోరంగి అభయారణ్యం
నియోజకవర్గంలో
మొత్తం ఓట్లు – 2,41,875
పురుషులు – 1,20,681
మహిళలు – 1,21,194
నగర పంచాయతీ – 1
పంచాయతీలు – 63
పోలింగ్ స్టేషన్లు – 268
మండలాలు
1. ముమ్మిడివరం
2. కాట్రేనికోన
3. ఐ.పోలవరం
4. తాళ్లరేవు
నియోజకవర్గ ప్రత్యేకతలు
మురమళ్ల శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. స్వామివారికి కల్యాణం జరిపిస్తే పెళ్లి కాని యువతీయువకులకు వెంటనే వివాహం జరుగుతుందని ప్రతీతి.
స్థానికంగా ఉన్న భగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో మహాశివరాత్రి మరుసటి రోజున బాలయోగీశ్వరుల తీర్థ మహోత్సవాలు జరుగుతాయి. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి బాలయోగీశ్వరుల దివ్య సమాధులను దర్శించుకుంటారు.
కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కార్తిక మాసంలో రాష్ట్ర నలుమాలల నుంచి భక్తులు తరలి వస్తారు.
తాళ్లరేవు మండలం కోరంగి అభయారణ్యం, కాట్రేనికోన మండలం కందికుప్ప లైట్ హౌస్లు పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. బంగాళాఖాతం సముద్ర తీరం మడ అడవులతో ఈ ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నియోజకవర్గ నడిబొడ్డున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది.
ఐదు ఇంజినీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాల, డెంటల్, డీఫార్మసీ కళాశాలలు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతం విద్యా కేంద్రంగానూ విరాజిల్లుతుంది.

ఆధ్యాత్మిక కేంద్రం ముమ్మిడివరం

ఆధ్యాత్మిక కేంద్రం ముమ్మిడివరం