
సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు : డీఎస్పీ
కాకినాడ క్రైం: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలంలో కూటమి తరఫున ఆదివారం ప్రచారానికి వచ్చిన నటుడు సాయిధరమ్ తేజ్పై దాడికి యత్నించారన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. ఈ మేరకు కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొన్న తేజ్ కాన్వాయ్ తాటిపర్తి గ్రామం మీదుగా చిన జగ్గంపేటకు వెళ్లి, అక్కడ ప్రచారం ముగించుకుని వెనక్కి వచ్చిందన్నారు. తాటిపర్తి కూడలికి చేరేసరికి కాన్వాయ్ విడిపోయిందని చెప్పారు. అలా విడివడిన కాన్వాయ్లో సాయి ధరమ్ తేజ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన అరగంట తర్వాత ఓ వ్యక్తికి గాయం కావడం వెలుగులోకి వచ్చిందన్నారు. బీరు బాటిళ్లు, గాజు గ్లాసులతో దాడి చేశారన్న విషయంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అందుకు తగ్గ ఎటువంటి ఆధారాలు ఘటనా స్థలిలో లభ్యం కాలేదని డీఎస్పీ అన్నారు. గాయాల పాలైన వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.